బాలుడిపై టీచర్ లైంగిక వేధింపులు, అతడి కోసం ఆత్మహత్యాయత్నం
చండీఘడ్: విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తన వద్ద ట్యూషన్ కోసం వచ్చే బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. అంతేకాదు ఆ బాలుడిని ట్యూషన్ మాన్పించినందుకు దగ్గు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు టీచర్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్ధులకు విద్యాబుద్దులు నేర్పి మంచి మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే వక్రమార్గంలో పయనిస్తున్న ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకొంటున్నాయి. ఈ తరహ ఘటన ఒకటి పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న ఓ 35 ఏళ్ళ మహిళ తన ఇంటి పక్కనే ఉండే ఇద్దరు పిల్లలకు ట్యూషన్ చెప్పేది. అయితే పదో తరగతి చదివే బాలుడిని లైంగికంగా వేధింపులకు గురిచేసింది. ఈ విషయం బాలుడి తల్లిదండ్రులకు తెలియడంతో ట్యూషన్ మాన్పించారు.
విద్యార్ధిపై టీచర్ లైంగిక వేధింపులు
పంజాబ్ రాష్ట్రంలోని చంఢీఘడ్కు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఇంటి వద్ద ట్యూషన్లు చెబుతుండేది. తమ పొరుగునే నివాసం ఉండే వారి పిల్లలకు కూడ ట్యూషన్ చెప్పేది. పదో తరగతి చదివే 14 ఏళ్ళ బాలుడితో పాటు అతడి చెల్లెకి 2017 నుండి ట్యూషన్ చెప్పేది. అయితే కొన్ని నెలల నుండి ఇద్దరిని వేర్వేరు సమయాల్లో ట్యూషన్ ను రమ్మని కోరింది. ఇద్దరిపై వ్యక్తిగతంగా శ్రద్ద చూపేందుకు అవకాశం ఉంటుందని తల్లిదండ్రులను నమ్మించింది. వేర్వేరు సమయాల్లో ట్యూషన్ కు వచ్చేలా చేసింది. పదో తరగతి చదివే బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడింది.
మార్కులు తగ్గాయని ట్యూషన్ మాన్పించారు
ట్యూషన్ కు వెళ్ళక ముందు ఆ విద్యార్ధికి మంచి మార్కులు వచ్చేవి. అయితే ట్యూషన్ కు వెళ్ళిన తర్వాత మార్కుల్లో ప్రగతి లేకుండాపోయింది. అంతేకాదు మార్కులు గణనీయంగా తగ్గిపోయాయి. అంతేకాదు గతంలో ఉన్నట్టుగా చురుకుగా ఉండడం లేదు. దీంతో ఆ టీచర్ ఇంటికి ట్యూషన్కు పంపడాన్ని ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో మాన్పించివేశారు తల్లిదండ్రులు.
బాలుడిని రూమ్ లో వేసి తాళం
అయితే ట్యూషన్కు పదో తరగతి బాలుడిని పంపాలని ఆ టీచర్ ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ, తల్లిదండ్రులు మాత్రం ట్యూషన్ కు పంపేందుకు మాత్రం అంగీకరించలేదు. అయితే ఒక్కసారి ఆ బాలుడిని తన ఇంటికి పంపాలని ఆ టీచర్ తల్లిదండ్రులను కోరింది. రెండు రోజుల క్రితం ఆ బాలుడిని తల్లిదండ్రులు టీచర్ ఇంటికి పంపారు. అయితే ఆ బాలుడు ఇంట్లోకి చేరగానే ఆ బాలుడిని ఇంట్లో వేసి తాళం వేసింది.
ఆత్మహత్యాయత్నం చేసిన టీచర్
అయితే ఈ విషయం తెలిసిన స్థానికులు టీచర్ బంధించిన రూమ్ నుండి ఆ బాలుడిని రక్షించారు. చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ కు సమాచారం ఇచ్చారు బాలుడి తల్లిదండ్రులు. వారు కూడ అక్కడకు చేరుకొని వాస్తవాలను ఆరా తీశారు. అంతేకాదు ఆ బాలుడు తనకు దక్కనందుకు గాను ఆ టీచర్ దగ్గు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు టీచర్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.