ఇదేం క్రమశిక్షణరా బాబూ..! విద్యార్థిని గొడ్డలితో నరికేస్తానని బెదిరించిన టీచర్..
కాశ్మీర్ : విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర. పిల్లలు సరిగా చదవకున్నా.. చెప్పినట్లు వినకున్నా టీచర్లు వారిని భయపెట్టడం సర్వసాధారణం. అయితే క్రమశిక్షణతో మెలగడం లేదని ఓ బాలుడి పట్ల టీచర్ దారుణంగా వ్యవహరించాడు. గొడ్డలితో నరికేస్తానని భయపెట్టాడు. జమ్మూ కాశ్మీర్లో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ స్టూడెంట్ను బెదిరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
దారుణం : హగ్ చేసుకోనివ్వలేదని హత్యాయత్నం చేశాడు..
జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్కు చెందిన విద్యార్థి సరిగా చదవడం లేదని టీచర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. పదేళ్ల విద్యార్థిని ఒకరు చేతులతో గట్టిగా పట్టుకోగా.. టీచర్ గొడ్డలిని అతని మెడపై ఉంచి బెదిరించాడు. ప్రవర్తన మార్చుకోకుండా గొడ్డలితో నరికేస్తానని భయపెట్టాడు. దీంతో భయపడిపోయిన బాలుడు గట్టిగా ఏడుస్తున్నా టీచర్ అతన్ని వదలిపెట్టలేదు. క్లాస్ రూంలో మిగతా పిల్లల వైపు తిరిగి మీరంతా కళ్లు మూసుకోండి వీడిని గొడ్డలితో నరికి చంపుతానని హెచ్చరించాడు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారడంతో దాని ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిందితులను గుర్తించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.