ఆగస్ట్ 15 తర్వాత నుండి స్కూళ్ళు ,కాలేజీలు: విద్యార్థులకు క్లారిటీ ఇచ్చిన హెచ్ఆర్డీ మంత్రి
కేంద్రం కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ నుండి స్కూల్స్ , కాలేజీలకు మినహాయింపు ఇవ్వలేదు . ఇక అంతేకాదు కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో విద్యా ప్రణాళిక మార్చటానికి కేంద్రం కసరత్తు చేసింది . నూతన విద్యా సంవత్సరంలో అనేక మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. ఇక అందుకోసం నూతన మార్గదర్శకాలను త్వరలో అందించనుంది కేంద్రం . ఇక ఈ సారి విద్యా సంవత్సరం ఆగస్ట్ 15 తర్వాత నుండి మొదలవుతుందని , స్కూళ్ళు , కాలేజీలు తెరవటానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది.
స్కూల్స్ , కాలేజీలు ఎప్పుడు తెరుచుకుంటాయో చెప్పిన హెచ్ఆర్డీ మంత్రి
హెచ్ఆర్డీ మంత్రి రమేష్ నిశాంక్ పోఖ్రియాల్ ఈసారి విద్యా సంవత్సరంపై క్లారిటీ ఇచ్చారు. మార్చి 16 నుండి మూసివేయబడిన పాఠశాలలు , కళాశాలలు ఆగస్టు 15 తరువాత తిరిగి తెరవబడతాయని ఆయన పేర్కొన్నారు. ఇక ఇప్పటికే ఎప్పుడెప్పుడు స్కూళ్ళు తెరుచుకుంటాయా అని ఎదురు చూస్తున్న సుమారు 33 కోట్ల మంది విద్యార్థులకు ఆయన ఆగస్ట్ తర్వాత స్కూల్స్ ప్రారంభం అవుతాయని చెప్పారు.
ఆగస్ట్ తర్వాత స్కూల్స్ , కాలేజీలు ప్రారంభం అవుతాయన్న మంత్రి రమేష్ పోఖ్రియాల్
మే నెలాఖరులో వచ్చిన నివేదికల ప్రకారం, జూలైలో పాఠశాలలు మరియు కళాశాలలు 30% హాజరుతో మరియు తక్కువ సంఖ్యలో విద్యార్థులతో నర్సరీ నుండి 8 వ తరగతి వరకు తిరిగి ప్రారంభమవుతాయని భావించారు.గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లు మొదట తమ విద్యాసంస్థలను తిరిగి తెరుస్తారని, సామాజిక దూర ప్రమాణాలను మరియు తక్కువ హాజరును కొనసాగించడానికి, పాఠశాల రెండు షిఫ్టులలో కొనసాగుతుందని కూడా పేర్కొంది. కానీ కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో తాజాగా హెచ్ ఆర్డీ మంత్రి ఆగస్టు తర్వాత పాఠశాలలు తిరిగి తెరిచే అవకాశం ఉందని పేర్కొన్నారు .
అన్ని పరీక్షల ఫలితాలు ఆగస్ట్ 15 లోపే వెల్లడిస్తామన్న మంత్రి
ఆగస్టు 15 లోగా గడచిన విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షలన్నీ పూర్తయ్యి ఈ సెషన్లో ఇప్పటికే నిర్వహించిన , నిర్వహిస్తున్న పరీక్షల ఫలితాలన్నింటినీ ప్రకటించడానికి ప్రయత్నిస్తామని హెచ్ఆర్డి మంత్రి తెలిపారు. ఈసారి ఆగస్ట్ తర్వాత ఖచ్చితంగా స్కూల్స్ ప్రారంభం అవుతాయని ఆయన గట్టిగా చెప్పారు . సిబిఎస్ఇ బోర్డు పరీక్షలు జూలై 1 నుంచి జూలై 15 వరకు ఉండగా, ఐసిఎస్ఇ, ఐఎస్సి పరీక్షలు జూలై 1 నుంచి జూలై 12 వరకు జరుగుతాయి .నీట్, జెఇఇ కూడా జూలైలో జరుగుతుండగా, నీట్ జూలై 26 న, జెఇఇ జూలై 18 నుండి జూలై 23 వరకు జరుగుతుంది.ఇక వీటి అన్నిటి ఫలితాలు ఆగస్ట్ 15 లోగా ఇచ్చేస్తామని ఆయన పేర్కొన్నారు .
కరోనా భద్రతా మార్గదర్శకాలు రూపొందిస్తున్న కేంద్రం
లాక్డౌన్ సంక్షోభం మధ్య, కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నుండి సడలింపులు ఇచ్చింది . ఇక ఎప్పుడెప్పుడా స్కూల్స్ కు, కాలేజీలకు వెళ్ళేది అని ఎదురు చూస్తున్న వారికి ఆగస్టు 15 తర్వాత కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందని చెప్పటం ఒక క్లారిటీ ఇచ్చినట్టయ్యింది . ఇక పాఠశాలలు తిరిగి తెరిచినప్పుడు కరోనా కోసం అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలకు ఎన్సిఇఆర్టి మార్గదర్శకాలు రూపొందిస్తే కాలేజీలు , యూనివర్సిటీల విషయంలో అనుసరించాల్సిన జాగ్రత్తలపై యుజిసి మార్గదర్శకాలను రూపొందిస్తుంది .
విద్యా వ్యవస్థలో సమూల మార్పుల దిశగా కేంద్రం
ఇక స్కూల్స్ , కాలేజీల్లో సైతం ఉపాధ్యాయులు మాస్కులు మరియు గ్లౌజులు ధరించాల్సి ఉంటుంది. పాఠశాలల్లో థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేసి విద్యార్థులను పరీక్షిస్తారు .ఇక బెంచీకి ఇద్దరు విద్యార్థులు మాత్రమే కూర్చుంటారు సామాజిక దూర నియమాలను పాటిస్తున్నారా లేదా అనేది సీసీ టీవీల ద్వారా నిత్యం పర్యవేక్షిస్తారు. భద్రతా మార్గదర్శకాలు ప్రతి పాఠశాలలోని అనేక ప్రదేశాలలో కూడా విద్యార్థులకు అర్ధం అయ్యేలా రాసి పెడతారు . ఇక ఇది మాత్రమే కాదు స్కూల్స్ ప్రారంభం అయ్యాక విద్యా ప్రణాళిక లోనూ మార్పులు చేస్తున్న కేంద్రం సమూలంగా విద్యా వ్యవస్థను మార్చేస్తుంది .