ముంబైని ముంచెత్తిన వర్షాలు : స్కూళ్లు, కాలేజీలకు సెలవు, రెడ్ అలర్ట్ జారీ...
ముంబై : భారీ వర్షాలతో ముంబై మహానగరం అల్లాడుతుంది. వరదనీరు చేరడంతో కాలనీలు నదులను తలపిస్తోన్నాయి. జనం ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. నిత్యావసర వస్తువుల కోసం కూడా వెళ్లలేని సిచుయేషన్ నెలకొంది. ఈ క్రమంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మరో 24 గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు.
వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై చిగురుటాకులా వణుకుతుంది. దీంతో ముంబై, థానే, కొంకణ్ పరిసరాల్లో పాఠశాల, కళాశాలలకు సెలవు పర్కటించారు. ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముంబైతోపాటు రాయిగఢ్ జిల్లాపై కూడా వర్షాలు ప్రభావం చూపుతాయని అధికారులు పేర్కొన్నారు. గురువారం ఉదయం నుంచి కురిసే వర్షం దాదాపు 204 మిల్లీ మీటర్ల వర్షం నమోదవుతుందని అధికారులు అంచనావేశారు. దీంతో రెడ్ అలర్ట్ కూడా జారీచేశారు.
ముంబై శివారులో బుధవారం రాత్రి కూడా భారీ వర్షం కురిసింది. దాదాపు 50 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. మూడుగంటల్లో కురిసిన కుంభవృష్టితో శివారు ప్రాంతాలు జలసంద్రాన్ని తలపిస్తున్నాయి. ముంబైలోని పల్గార్, థానే, రాయిగఢ్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలతో రైళ్లు, విమాన సేవలకు కూడా అంతరాయం కలిగింది.