విద్యార్థినులు సేఫేనా? ఇంకెన్ని రోజులిలా!: డేరా స్కూళ్లపై అనుమానం, అసలేం జరుగుతోంది?
తమ పిల్లలను కలవనీయకుండా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని కొంతమంది తల్లిదండ్రులు వాపోతున్నారు.
Recommended Video
చంఢీగఢ్: డేరా బాబా అరెస్టుతో డేరా సచ్చా సౌదా ఆధీనంలో నడుస్తున్న స్కూళ్లు సైతం తాత్కాళికంగా మూతపడిన సంగతి తెలిసిందే. బాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ పరారీలో ఉండటం, డేరా చైర్ పర్సన్ విపన్సన ఇన్సాన్ క్రియాశీలకంగా వ్యవహరించకపోతుండటతో డేరా కార్యాకలాపాలకు ఆటంకం ఏర్పడింది.
డేరా ఆధీనంలోని స్కూళ్లు సిస్రా, దాని చుట్టు పక్కల గ్రామాల్లోనే ఉండటం, ఆ ప్రాంతమంతా ఇప్పుడు కర్ఫ్యూలో ఉండటం కూడా స్కూళ్ల మూసివేతకు కారణంగా తెలుస్తోంది. డేరా బాబా అరెస్టు తర్వాత ఈ స్కూళ్లు మూతపడ్డాయి. ఇప్పటికీ 10రోజులైనా మళ్లీ తెరుచుకోకపోగా.. తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయన్న దానిపై క్లారిటీ లేకుండా పోయింది.
తల్లిదండ్రుల ఆందోళన:
10రోజుల నుంచి స్కూల్స్ తెరుచుకోకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. వారి భవిష్యత్తు దెబ్బతింటుందని వాపోతున్నారు. స్కూల్స్ ఎప్పుడు తెరుచుకుంటాయనే దానిపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో.. స్కూల్స్ శాశ్వతంగా మూతపడుతాయా? అన్న అనుమానం కూడా వారిలో ఆందోళన పెంచుతోంది.
అదే జరిగితే విద్యా సంవత్సరం నష్టపోయే అవకాశం ఉందని స్కూళ్ల ప్రిన్సిపాల్ అసోసియేషన్ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే స్కూళ్ల రీఓపెనింగ్ విషయంలో చొరవ చూపించాలని కోరుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు బృందంగా మారి జిల్లా విద్యాధికారి మునిష్ నాగ్ పాల్ను కలిసి వినతి పత్రం అందజేశారు.
మునీష్ స్పందన:
స్కూళ్ల రీఓపెనింగ్ కు చొరవ చూపించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు వినతిపత్రం అందించడంతో విద్యాధికారి మునిష్ దీనిపై స్పందించారు. మరో 10రోజుల పాటు వేచి చూడక తప్పదని ఆయన పేర్కొనడం గమనార్హం. త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్నతాధికారులకు విషయం చేరవేశానని, విద్యార్థులకు తరగతులు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు.
డేరా ఆధీనంలో మొత్తం మూడు స్కూళ్లు, రెండు జూనియర్ కాలేజీలు, ఓ బీఈడీ కాలేజీ ఉన్నాయి. సిర్సా దాని చుట్టు పక్కల గ్రామాలైన నెజియాకేరా, బెజెకన్, బెగూ గ్రామాల్లో ఇవి ఉన్నాయి.మొత్తం 8000పైచిలుకు విద్యార్థులు వీటిల్లో విద్యను అభ్యసిస్తున్నట్లు తెలుస్తోంది.
విద్యార్థినులను కలవనీయకుండా!:
డేరా స్కూళ్లపై వినిపిస్తున్న పలు ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. తమ పిల్లలను కలవనీయకుండా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని కొంతమంది తల్లిదండ్రులు వాపోతున్నారు. చాలామంది విద్యార్థినిలకు బాహ్యా ప్రపంచంతో సంబంధం లేకుండా చేశారని, ఆఖరికి కన్న తల్లిదండ్రులు వారి చూడాలనుకున్నా అనుమతి ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ ఫిర్యాదుతో వెలుగులోకి, అనుమానాలు!:
పర్మీందర్ సింగ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో స్కూళ్లలో విద్యార్థినుల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. తన్ కజిన్ ను కలవనీయకుండా డేరా స్కూల్స్ యాజమాన్యం అడ్డుకుంటోందని పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు.
మరో యువతిని విషయంలోను ఇదే జరుగుతోంది. ఆమె బీ.ఏ కోర్సు కోసం అక్కడ చేరినప్పటి నుంచి తిరిగి ఆమెను కుటుంబ సభ్యులతో కలవనీయలేదు. అదేమంటే.. కోర్సు పూర్తయ్యేదాకా అదంతేనని సమాధానిస్తున్నారట. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి కూడా తమ కూతురిని కలవనీయడం లేదంటూ పోలీసులను ఆశ్రయించాడు.
అయితే సదరు అమ్మాయిల తరుపు నుంచి కూడా ఫిర్యాదు వస్తేనే తామే స్పందిస్తామని అధికారులు చెబుతుండటం గమనార్హం. డేరా ఆశ్రమంలో గుర్మీత్ సింగ్ చేసిన అఘాయిత్యాల నేపథ్యంలో డేరా స్కూళ్లలో విద్యార్థినుల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వారిని నిర్భంధించి ఎలాంటి సమాచారం బయటకు రాకుండా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.