కశ్మీర్లో స్కూల్స్ రీ-ఓపెన్ : విద్యార్థులు లేక వెలవెలబోయిన తరగతి గదులు
శ్రీనగర్ : కశ్మీర్లో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. ఇవాళ్టి నుంచి ప్రభుత్వ పాఠశాలలు కూడా పున:ప్రారంభమయ్యాయి. అయితే పాఠశాలకు విద్యార్థుల హాజరుశాతం మాత్రం తగ్గింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు భయపడినట్టు అర్థమవుతుంది.
సోమవారం శ్రీనగర్లో 190 ప్రాథమిక పాఠశాలలు తెరుచుకున్నాయి. కానీ తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. మరోవైపు శ్రీనగర్లో వరుసగా 15వ రోజు కూడా పాఠశాలు మూసివేశారు. తమ పిల్లలను బడికి పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాల్లో మాత్రమే విద్యార్థులు కొంచెం ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఈ పరిస్థితుల్లో తమ పిల్లలను పాఠశాలలకు పంపించమంటారా అని ఫరూక్ అహ్మద్ దర్ అనే తండ్రి మీడియాకు తెలిపారు.'
బారాముల్లా జిల్లాలో ఐదు పట్టణాల్లో పాఠశాలలను మాత్రం మూసివేసినట్టు అధికారులు పేర్కొన్నారు. పట్టాన్, పల్హలాన్, సింగ్పోర, బారాముల్లా, సోపోర్లో మాత్రం నిబంధనలను సడలించారు. ఇవాళ అన్ని పాఠశాలలను తెరిచినట్టు అధికారులు తెలిపారు. కానీ పాత నగరం, సివిల్ లైన్ ఏరియాలో మాత్రం తీయలేదని పేర్కొన్నారు. ఇప్పటికే ఆదివారం కమ్యునికేషన్ వ్యవస్థను పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ సేవలను కూడా రీ స్టోర్ చేశారు. 24 జిల్లాల్లో 12 జిల్లాలో పరిస్థితి అదుపులో ఉందని అధికారులు చెప్తున్నారు. ఒక ఐదు జిల్లాల్లో మాత్రం బందోబస్త్ కొనసాగుతుందని స్పష్టంచేశారు. అన్ని జిల్లాల్లో పరిస్థితిని బట్టి నిబంధనలను సడలిస్తామని తేల్చిచెప్పారు.