100 రోజుల తర్వాత.. కశ్మీర్లో పూర్తిగా ఆంక్షలు సడలింపు... తెరిచిన స్కూళ్లు, షాపులు
జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత నెలకొన్న పరిణామాలతో విధించిన ఆంక్షలు క్రమంగా తొలగిస్తున్నారు. మంగళవారంతో కశ్మీర్లో ఆంక్షలు విధించి 100 రోజులవుతోంది. ఆగస్ట్ 5వ తేదీ నుంచి కశ్మీర్ నివురుగప్పిన నిప్పులా మారిన సంగతి తెలిసిందే. దాదాపు 40 వేల మంది సీఆర్పీఎఫ్ బలగాలను మొహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు.
ఆంక్షలు పూర్తిగా సడలింపు
స్కూళ్లు, కాలేజీలు, షాపులు మంగళవారం పూర్తిగా తెరచుకున్నాయి. రోజంతా తెరచుకునే ఉన్నాయి. కశ్మీర్లోని లాల్ చౌక్ వద్ద నిత్యం రద్దీగా ఉండే షట్టర్లను తెరిచారు. ఆగస్ట్ 5వ తేదీ తర్వాత షాపులను కొన్ని గంటలపాటు తెరుస్తున్నారు. కానీ మంగళవారం మాత్రం పూర్తిగా షాపులు తెరుచుకొని ఉండటంతో పరిస్థితి కుదుటపడ్డట్టే అనిపించింది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు
గత కొద్దిరోజుల నుంచి షాపుల మూసి ఉన్నాయని.. ఇవాళ తెరుచుకోవడంతో పరిస్థితి మారినట్టు అనిపించిందని స్థానికులు తెలిపారు. మరోవైపు జమ్ము కశ్మీర్లో ప్రజా రవాణాపై ఆంక్షలు కొనసాగాయి. స్థానికంగా నడిచే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఆయా మార్గాల్లో బస్సులను అందుబాటులో ఉంచాలని జేఅండ్ కే ఆర్టీసీని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ మేరకు చర్యలు తీసుకున్నారు.
స్కూల్లో విద్యార్థుల సందడి
మరోవైపు పాఠశాలలకు విద్యార్థులకు కూడా హాజరయ్యారు. దాదాపు మూడునెలల తర్వాత చిట్టి, పొట్టి చిన్నారులు స్కూళ్ల బాట పట్టారు. పరీక్షలు సమీపిస్తోన్న కొద్దీ స్కూళ్లు తిరిగి తెరచుకోవడంతో సంతోషంగా ఉందని విద్యార్థులు అంటున్నారు. సాధారణంగా తమ హాజరుశాతం 90 శాతం ఉంటుందని.. కశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మాత్రం కాస్త తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.
100 రోజులు
జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దుచేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దు చేసి.. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రప్రాంత పాలిత ప్రాంతాలుగా విభజించింది. దీంతో హింసాత్మక పరిస్థితులు తలెత్తుతాయని భారీగా సీఆర్పీఎఫ్ బలగాలను మొహరించారు.