పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న శాస్త్రవేత్తలు, మేధావులు..ఎందుకో తెలుసా?
Recommended Video
న్యూఢిల్లీ:వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును లోక్సభలో పాస్ కాగా మరోవైపు పెద్ద ఎత్తున ఈ బిల్లుపై వ్యతిరేకత వస్తోంది. ప్రతిపాదించిన బిల్లులో అతి జాగ్రత్తగా ముస్లింలను తప్పించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దేశంలోని శాస్త్రవేత్తలు, ఇతర మేధావులు. పౌరసత్వం మత ప్రాతిపదికన ఇవ్వడం భవిష్యత్తులో అలజడులకు దారి తీసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా 918 మంది విద్యావేత్తలు మరియు శాస్త్రవేత్తలు పౌరసత్వ సవరణ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇందులో పలువురు ప్రముఖులు అయిన జోయా హసన్, హర్బాన్స్ ముఖియాలు కూడా ఉన్నారు. పొరుగు దేశాలైన పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి భారత్కు వచ్చిన ముస్లింయేతర ప్రజలకు సరైన డాక్యుమెంట్లు లేనప్పటికీ పౌరసత్వం ఇవ్వడాన్ని వీరంతా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మనము రాసుకున్న రాజ్యాంగంలో అన్ని మతాల వారు సమానమే అని చెబుతోందన్న విషయాన్ని గుర్తుచేశారు.
మత ప్రాతిపదికన వ్యక్తులకు పౌరసత్వం ఇవ్వడం అనేది రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు తూట్లు పొడిచే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 దేశంలో నివసించే ప్రతి పౌరుడు చట్టం ముందు సమానులే అని సూచిస్తోందన్న విషయాన్ని మేధావులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బిల్లును వెంటనే ప్రభుత్వం విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేసింది. అంతేకాదు బిల్లును పునఃసమీక్షించి మైనార్టీలకు కూడా భద్రత కల్పించేలా బిల్లును రూపొందించాలని చెప్పారు. అంతేకాదు ఆశ్రయం కోరుతూ పొరుగు దేశాల నుంచి వచ్చిన వారి సమస్యలకు కూడా పరిష్కారం కనుగొని బిల్లులో పొందుపర్చాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాదు బిల్లు ముసాయిదాను న్యాయనిపుణుల నేతృత్వంలో పునఃసమీక్ష చేయించాలని రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందా లేదా అనేది సమీక్షించాలని వారు డిమాండ్ చేశారు.