MP crisis: 22 మంది మంత్రులు రాజీనామా, జ్యోతిరాదిత్య ‘బీజేపీ’స్కెచ్, మోడీ కేబినెట్లోకి సింధియా?
భోపాల్: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచింది. అయితే, ఇప్పటివరకు ఈ ప్రభుత్వం గత కర్ణాటక జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వంలానే దిన దిన గండం అన్నట్లు కొనసాగుతోంది. కర్ణాటకలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కర్ణాటక తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్రంపై బీజేపీ కన్నేసినట్లు తెలుస్తోంది.
Recommended Video
18మంది ఎమ్మెల్యేలు.. బీజేపీతో సింధియా..
కమల్ నాథ్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు సంక్షోభంలో మునిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ రెబల్గా మారిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా వెంట 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా కర్ణాటకలో ఉన్నట్లు తెలుస్తోంది. సింధియా మాత్రం ఢిల్లీలో బీజేపీ నేతలతో టచ్లో ఉన్నట్లు సమాచారం.
సింధియా ఎఫెక్ట్.. 22 మంత్రులు రాజీనామా..
ఈ నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమైన అనంతరం కమల్ నాథ్ రాస్ట్ర కేబినెట్తో ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో 22 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. వెంటనే ఆ రాజీనామాలకు కమల్ నాథ్ ఆమోద ముద్ర వేశారు. సింధియా వెంట ఉన్న ఎమ్మెల్యేలు తిరిగి వస్తే ఆ మంత్రి పదవులను ఇచ్చేందుకు సిద్ధమని సీఎం కమల్ నాథ్ సంకేతాలిచ్చారు. దీంతో వారంతా సీఎం వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. అంతేగాక, ఆ ఎమ్మెల్యేలంతా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నట్లు తెలిసింది.
బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా పావులు..
కాగా, జ్యోతిరాదిత్య సింధియా వెంటే ఉన్న 18 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి మద్దతిచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి.. సింధియా కూడా బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నట్లు తెలిసింది. అంతేగాక, ఈ ఎమ్మెల్యేల సాయంతో శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాలతో చౌహాన్ భేటీ అయినట్లు సమాచారం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది.
మోడీ కేబినెట్లోకి సింధియా..
ఒకవేళ జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సహకరించినట్లయితే.. ఆయనకు ఆ పార్టీ భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో సింధియాను చేర్చుకునేందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. తమతో కలిసి వస్తే సింధియాకు కేంద్రమంత్రి పదవిని కట్టబెట్టే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.