ఆమెకు ముందే ఎలా తెలిసింది... సుశాంత్ కేసులో మరో సంచలనం... భట్ గ్యాంగ్ లేడీ స్క్రీన్ షాట్స్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసు అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు మహేష్ భట్ అసోసియేట్ సుహ్రితా దాస్ ఫేస్బుక్ పోస్టు స్క్రీన్ షాట్స్ తాజాగా వైరల్గా మారాయి. ట్విస్ట్ ఏంటంటే... సుశాంత్ సింగ్ మరణం గురించి ఇంకా ప్రపంచానికి తెలియకముందే... సుహ్రితాదాస్ ఆ పోస్టులో ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసేసింది.
జూన్ 18,ఉదయం 11.08గం. సమయంలో ఫేస్బుక్లో ఆ పోస్టు పెట్టిన సుహ్రితా... ఆ తర్వాత దాన్ని తొలగించి తన ప్రొఫైల్ను లాక్ చేసుకుంది. తాజాగా ఆ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ కావడంతో సుహ్రితాదాస్పై పలువురు నెటిజెన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సుహ్రితాదాస్ పోస్టులో ఏముంది....
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి గురించి అందులో పేర్కొన్న సుహ్రితాదాస్... క్లినికల్ డిప్రెషన్ వల్లే అతను చనిపోయాడని పేర్కొనడం గమనార్హం. 'డియర్ రియా,ప్రపంచమంతా సుశాంత్ మరణం పట్ల విచారం,షాక్ను వ్యక్తపరుస్తున్న తరుణంలో... నేను నీకు అండగా నిలబడుతాను. సుశాంత్తో కలిసి ఉండేందుకు నువ్వు చేసిన ఎన్నో అసాధ్యమైన ప్రయత్నాలకు నేనో మౌన ప్రేక్షకురాలిని. ఒక తల్లిగా,బాధ్యాతయుతమైన పౌరురాలిగా నైతిక బాధ్యతతో నేను స్పందిస్తున్నాను. క్లినికల్ డిప్రెషన్ అనేది ఒక అనూహ్య విపత్తు లాంటిది. దానికి వైద్య రంగంలో ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం లేదు.' అని సుహ్రితా తన పోస్టులో పేర్కొన్నారు.
సుహ్రితాకు ముందే ఎలా తెలిసింది...
'ప్రతీసారి భట్ సార్ ఆఫీస్కు నువ్వు పరిగెత్తుకొచ్చి ఆయన సలహాలు తీసుకోవడాన్ని,ఆయనతో ఫోన్లో మాట్లాడటాన్ని... ఇలా నీ కష్టాలన్నింటినీ చూశాను. నీ సర్వస్వాన్ని నీవు అతనికి ఇచ్చావు. ఓ మహిళగా చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశావు. ' అని సుహ్రితా రియా గురించి చెప్పుకొచ్చారు. అయితే ఈ పోస్టుపై నెటిజెన్స్ అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. సుశాంత్ మృతి గురించి ఇంకా బయటి ప్రపంచానికి తెలియకముందే సుహ్రితాకు ఆ విషయం ఎలా తెలిసిందని ప్రశ్నిస్తున్నారు.
భట్ గ్యాంగ్ లేడీ... అలర్ట్...
'భట్ గ్యాంగ్కు చెందిన ఈ లేడీ ఉదయం 11గంటలకే సుశాంత్ మృతి గురించి ఎలా చెప్పగలిగింది. అలర్ట్,ఇదో కీలక సాక్ష్యాధారం,దయచేసి దీన్ని వైరల్ చేయండి.' అంటూ ఓ నెటిజెన్ పెట్టిన పోస్టును బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సైతం రీట్వీట్ చేయడం గమనార్హం. సుశాంత్ సింగ్ రాజ్పుత్ బెడ్ రూమ్ తలుపు ఇంకా తెరవకముందే... అతను చనిపోయాడో,బతికే ఉన్నాడో ఇంకా ఎవరికీ ఏమీ తెలియకముందే... ఫేస్బుక్లో సుహ్రితా దాస్ ఈ పోస్టు ఎలా పెట్టిందని నెటిజెన్స్ నిలదీస్తున్నారు.
సాక్ష్యులకు భద్రత కల్పించాలని...
మరోవైపు సుశాంత్ కేసులో సాక్ష్యాధారాలు బయటపెడుతున్నవారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సుశాంత్ బంధువు, బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ కుమార్ సింగ్ బబ్లు పేర్కొనడం గమనార్హం. ఈ కేసులో అసలు నిజాలు బహిర్గతం చేసేందుకు చాలామంది సాక్ష్యులు ఉన్నారని, వారు ప్రాణ భయంతో బయటకు రావట్లేదని అన్నారు. కాబట్టి ఇప్పటికే ముందుకు వచ్చిన సాక్ష్యులకు భద్రత కల్పించాలని... తద్వారా సాక్ష్యాధారాలు నాశనం కాకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే పోలీసులను కోరారు.