ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని భర్తను విహారయాత్రకు తీసుకెళ్లి చంపిన భార్య
కొడైకెనాల్/మధురై: ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపిన సంఘటన తమిళనాడులో వెలుగు చూసింది. మృతుడు ఇంజినీర్. థేని జిల్లాలోని దేవఢనపట్టి పోలీసులు ఇంజినీర్ హత్య కేసులో అతని భార్య, ఆమె ప్రియుడి కోసం వేట కొనసాగిస్తున్నారు. అతని మృతదేహాన్ని పోలీసులు కొడైకెనాల్ దారిలో దుంపుంపరాయ్ సమీపంలో గుర్తించారు.
తొలుత ఈ మృతదేహం ఎవరితో తెలియదు. ఆ తర్వాత ఇక్కడ లభ్యమైన మృతదేహం మహ్మద్ సమీర్దిగా పోలీసులు గుర్తించారు. ప్రియుడితో కలిసి భార్యే ఇతనిని హత్య చేసినట్లు చెప్పారు. థేని జిల్లా దేవదానపట్టి వద్ద కొడైక్కానల్ వెళ్లే పర్వత ప్రాంతంలో ఈ నెల 18వ తేదీన గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గొంతుకోసి హత్య చేసినట్లుగా గుర్తింపు
అక్కడి చేరుకున్న దేవదానపట్టి పోలీసులు అతనిని గొంతు కోసి హత్య చేసినట్లుగా గుర్తించారు. తేల్చారు. అదే సమయంలో కర్ణాటకలోని మంగుళూరు పోలీసులు దేవదానపట్టి వచ్చి వివరాలు సేకరించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహ్మద్ సమీర్ (32) గల్ఫ్లో ఇంజినీర్గా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ప్రదోష్ అనే మహిళతో పెళ్లయింది. వీరికి ఆరు నెలల పాప ఉంది.
గల్ఫ్లో ఉంటూ ప్రతి ఆర్నెళ్లకోసారి కుటుంబం వద్దకు
గల్ఫ్లో ఉంటున్న ఇతను దాదాపు ఆరు నెలలకోసారి భార్యను, కుటుంబ సభ్యులను చూసేందుకు వచ్చేవాడు. ఈ క్రమంలో ప్రదోష్కు మంగుళూరుకు చెందిన కారు డ్రైవర్ మహ్మద్ యాషిక్తో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ తర్వాత వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ప్రియుడితో కలిసి హత్య
అదే సమయంలో గత నెలలో గల్ఫ్ నుంచి వచ్చిన భర్తను కొడైకెనాల్ టూర్కు తీసుకు వెళ్లిన భార్య ప్రదోష్ ప్రియుడు మహ్మద్ యాషిక్ సాయంతో గొంతు కోసి హత్య చేసింది. అనంతరం ఈ నెల 17వ తేదీన కుమార్తెతో కలిసి ఆమె మాత్రమే ఇంటికి వెళ్లింది.
అప్పుడు అనుమానం వచ్చి
దీనిపై కుటుంబ సభ్యులు, ఇతరులు భర్త గురించి ఆమెను అడిగారు. భర్త ఫ్రెండ్స్తో కలిసి సేలంలో ఉన్నట్లు ఆమె చెప్పింది. అనంతరం ఇంట్లోని అరవై సవర్ల బంగారు నగలు తీసుకొని కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహ్మద్ సమీర్ హత్యకు గురైనట్లుగా గుర్తించారు. ప్రియుడితో ప్రదోష్ హత్య చేసిందని, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని, పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నామని చెప్పారు.