
ఉదయ్పూర్ మర్డర్: 144 సెక్షన్ విధింపు, ఇంటర్నెట్ బంద్, శాంతియుతంగా ఉండండి: అశోక్ గెహ్లట్
బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన కామెంట్స్ ఒకరి ప్రాణాలు తీసింది. ఆమెకు అనుకూలంగా ఓ దుకాణాదారు స్టేటస్ పెట్టుకున్నాడు. అదీ గిట్టని ముస్లింలు అతనిని దారుణంగా తల నరికి చంపేశారు. రాజస్థాన్లో గల ఉదయ్పూర్లో ఘటన జరిగింది. దీంతో హిందు సంస్థలు ఆందోళనకు దిగాయి. ఒక్కసారిగా హై టెన్షన్ నెలకొంది.

వీడియో తీసి మరీ..
అతనిని హత్య చేసే సమయంలో వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. ఇరు వర్గాల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో 144 సెక్షన్ విధించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి కర్ప్యూ అమల్లోకి వచ్చింది. అలాగే ఉదయ్పూర్లో ఇంటర్నెట్ సేవలను కూడా బంద్ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

షాపులోకి వెళ్లి మరీ..
ఇద్దరు షాపులోకి ప్రవేశించి హల్ చల్ చేశారు. అతనిని కత్తితో మెడ నరికేశారు. అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా బెదిరించారు. ప్రశాంతంగా ఉండాలని సీఎం అశోక్ గెహ్లట్ ప్రజలను కోరారు. యువకుడి హత్య ఘటనను ఖండించారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. హత్య బాధాకరమన్నారు. దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని వివరించారు. ఇలాంటి పరిస్థితిలో దేశాన్ని ఉద్దేశించి ప్రధాని కానీ, అమిత్ షా కానీ ఎందుకు మాట్లాడటం లేదని, ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో వారి మౌనం ఆరోగ్యకరం కాదన్నారు.

పోలీసుల మొహరింపు
నూపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ను షేర్ చేసిన ఓ యువకుడు మంగళవారం దారుణ హత్యకు గురయ్యాడు. అతనిని ఇద్దరు అగంతులు తలనరికి మరీ చంపారు. ఉదయ్పూర్లోని మాల్డాస్ స్ట్రీట్లో ఘటన జరిగింది. ఒక్కసారిగా ఉదయ్పూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాల్డాస్ స్ట్రీట్ ప్రాంతంలో దుకాణాలు మూసేశారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అదనంగా 600 మంది పోలీసులను ఆ ప్రాంతానికి తరలించారు. అగంతకులు ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.