ఆసియా అతిపెద్ద స్లమ్.. ధారావిలో రెండో కరోనా పాజిటివ్.. 24గంటల్లోనే..
ఆసియాలోని అతిపెద్ద మురికివాడ ముంబైలోని ధారావిలో రెండో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. బుధవారం(ఏప్రిల్ 1)న ధారావిలో కరోనా సోకిన ఓ వ్యక్తి మృతి చెందగా.. 24గంటల్లోనే రెండో కేసు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మృతుడి ఇంట్లో ఉన్న ఏడుగురిని క్వారెంటైన్ చేసి.. ఇంటికి స్టిక్కరింగ్ కూడా చేశారు. ముంబైలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో.. ధారావికి కూడా వైరస్ వ్యాప్తి చెందడం ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతోంది.
ధారావిలో ఒకే రూఫ్ కింద పరుచుకుపోయినట్టుగా వేలాది ఇళ్లు ఉంటాయి. కేవలం 5 చదరపు కి.మీ పరిధిలోనే దాదాపు 10లక్షల మంది జనం నివసిస్తున్నారంటే.. ఇక్కడి ఇళ్లు ఎంతలా కుక్కినట్టు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అసలే మురికివాడ కావడంతో.. ఇక్కడ వైరస్ విజృంభిస్తే జరిగే నష్టం దారుణంగా ఉంటుందనడంలో సందేహం అక్కర్లేదు.
కాగా, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి మహారాష్ట్ర హాట్ స్పాట్గా మారిన సంగతి తెలిసిందే. దేశంలో 2095 పాజిటివ్ కేసులు నమోదవగా.. ఒక్క మహారాష్ట్రలోనే 339 కేసులు నమోదయ్యాయి. అందులో ముంబై నగరంలోనే 142 కేసులు నమోదవడం గమనార్హం. తాజాగా ధారావిలో కరోనా సోకి మృతి చెందిన వ్యక్తికి విదేశీ ట్రావెల్ హిస్టరీ కూడా లేదు.
Recommended Video
దీంతో లోకల్ కాంటాక్ట్ కేసు గానే దీన్ని పరిగణిస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో కరోనా అనుమానిత లక్షణాలున్న 5వేల మందిని గుర్తించిన హైరిస్క్ కేటగిరీలో వీరందరినీ క్వారెంటైన్లో ఉంచారు.ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు చోటు చేసుకున్న మొత్తం 14 కరోనా మరణాల్లో 12 మంది ముంబైలోనే చనిపోవడం గమనార్హం.