COVID-19: రెండో కరోనా మరణం నమోదు, దేశ రాజధానిలోనే, అన్నీ బంద్
న్యూఢిల్లీ: భారతదేశంలోనూ కరోనావైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే 82 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా.. తాజాగా కరోనా సోకి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరింది. కర్ణాటక రాష్ట్రంలో తొలి మరణం చోటు చేసుకోగా.. దేశ రాజధానిలో రెండో మరణం నమోదైంది.
Recommended Video
దేశంలో రెండో కరోనా మరణం
కరోనా బారినపడి చికిత్స పొందుతూ ఢిల్లీలో 69ఏళ్ల ఓ మహిళ శుక్రవారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు ఢిల్లీలోని జనక్పురి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా సమాచారం. దేశంలో ఇది రెండో కరోనా మరణమని హెల్త్ సెక్రటరీ ప్రీతి సుదాన్ ప్రకటించారు.
స్విట్జర్లాండ్, ఇటలీకి వెళ్లి వచ్చి..
మృతి చెందిన మహిళ, ఆమె కుమారుడు ఫిబ్రవరిలో స్విట్జర్లాండ్, ఇటలీలో పర్యటించి తిరిగి భారత్కు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వారిద్దరికీ పరీక్షలు నిర్వహించగా.. కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. దీంతో మార్చి 7న ఢిల్లీ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేరారు.
మార్చి 9 నుంచి వెంటిలేర్పైనే..
సదరు మహిళకు అప్పటికే డయాబెటిస్, హైపర్టెన్షన్ కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మార్చి 9 నుంచి మహిళ ఆరోగ్యం మరింతగా క్షీణించిందని, అప్పట్నుంచి వెంటిలేటర్పై చికిత్స అందించామని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. మరింతగా ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు.
అన్నీ బంద్..
కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో థియేటర్లు, పాఠశాలలు మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలు సమావేశాల్లో పాల్గొనవద్దని, గుంపులుగా చేరవద్దని సూచించారు. కర్ణాటకలోనూ అక్కడి ప్రభుత్వం ఇలాంటి చర్యలే చేపట్టింది. కర్ణాటకతోపాటు కేరళ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్, హర్యానా తదితర రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు మూతపడ్డాయి.