13 రాష్ట్రాలు..97 లోక్ సభ స్థానాలు: తేలనున్న ప్రకాశ్ రాజ్, సుమలత భవితవ్యం! కమల్ కి అగ్నిపరీక్షే
బెంగళూరు: దేశంలో రెండో విడత ఎన్నికల ప్రచారం పరిసమాప్తమైంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోయాయి. ర్యాలీలు, ప్రదర్శనలు, ప్రచార సభలకు పుల్ స్టాప్ పడింది. గురువారం ఉదయం 7 గంటలకు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 97 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఒడిశాలో 35 అసెంబ్లీ స్థానాలకు కూడా గురువారం రెండో దశ పోలింగ్ జరుగనుంది. కర్ణాటకలో 28, తమిళనాడులో 39 లోక్ సభ స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ జరుగనుంది. అస్సాం, బిహార్, ఛత్తీస్ గఢ్, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర, మణిపూర్, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలల్లో 97 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ కొనసాగనుంది.
కర్ణాటకలో మూడోతరం పోటీ..
మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవేగౌడ సహా పలువురు సీనియర్ నాయకులు రెండో దశ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఒక్క దేవేగౌడ మాత్రమే కాదు.. ఆయన కుటుంబం నుంచి మూడోతరం నాయకులు మరో ఇద్దరు లోక్ సభ ఎన్నికల్లో పోటీలో నిలబడటం విశేషం. దేవేగౌడ ఇద్దరు మనవళ్లు కూడా లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్నారు. దేవేగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ సంతానం ప్రజ్వల్ రేవణ్ణ హాసన నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. దేవేగౌడ రెండో కుమారుడు, ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ ఈ సారి రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. ప్రతిష్ఠాత్మక మండ్య లోక్ సభ నుంచి నిఖిల్ పోటీ చేస్తున్నారు. `జాగ్వార్` సినిమాతో నిఖిల్ తెలుగు ప్రేక్షకులకు చిర పరిచితుడే. కాగా- దేవేగౌడ ఈ సారి కూడా పోటీలో నిల్చున్నారు. తనకు కంచుకోటగా మారిన హాసన నియోజకవర్గాన్ని మనవడి చేతిలో పెట్టిన దేవేగౌడ.. సంప్రదాయానికి భిన్నంగా తుమకూరు లోక్ సభ నుంచి బరిలో దిగారు.
కన్నడ నాట సినీ గ్లామర్..
మండ్య నుంచి నటి సుమలత, బెంగళూరు సెంట్రల్ నుంచి సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ఒకేసారి రాజకీయాల్లోకి ప్రవేశించడం చెప్పుకోదగ్గ విశేషం. ఈ విషయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే- వారిద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగారు. సుమలతకు బీజేపీ మద్దతు ఇస్తుండగా.. ప్రకాష్ రాజ్ కు ఆమ్ ఆద్మీ పార్టీ అండగా నిలిచింది. ఈ రెండు స్థానాల్లో అటు బీజేపీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. దీనితోపాటు నిఖిల్ గౌడ కూడా నటుడే కావడంతో.. కర్ణాటక రాజకీయాలు సినీ గ్లామర్ ను సంతరించుకున్నాయి. కేజీఎఫ్ సినిమాతో టాప్ రేంజ్ కు దూసుకెళ్లిన శాండల్ వుడ్ హీరో యశ్, ఛాలెంజింగ్ స్టార్ గా గుర్తింపు పొందిన దర్శన్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. వారిద్దరూ సుమలతకు మద్దతుగా ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుమలత ఓటమి కోసం ప్రచారం చేయడం కొసమెరుపు.
నవీన్ పట్నాయక్..నాలుగోసారి
ఒడిశాలో బిజూ జనతాదళ్ వరుసగా మూడుసార్లు అధికారాన్ని అందుకుంది. నాలుగో సారి సమరానికి సన్నద్ధమైంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాలుగో సారి కూడా ప్రమాణ స్వీకారం చేస్తారా? లేదా? అనేది తేలాలంటే మే 23వ తేదీ వరకు ఆగాల్సిందే. 147 స్థానాలు ఉన్న ఒడిశా అసెంబ్లీకి రెండో విడతలో 35 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించబోతున్నారు. సీనియర్ నటి హేమామాలిని పోటీ చేస్తోన్న ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర నియోజకవర్గానికి కూడా రెండో విడతలోనే పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న హేమామాలిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి. బీజేపీ అభ్యర్థిగా ఆమె బరిలో ఉన్నారు.
లోకనాయకుడికీ అగ్నిపరీక్షే..
బహుభాషా నటునిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరో కమల్ హాసన్. ఆయన నెలకొల్పిన మక్కళ్ నీధి మయ్యం పార్టీ తొలిసారిగా లోక్ సభ ఎన్నికలను రుచి చూస్తోంది. ఈ లోక్ సభ ఎన్నికల్లో కమల్ హాసన్ పోటీ చేయట్లేదు. అయినప్పటికీ.. తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు. రెండో దశలో తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలకూ పోలింగ్ జరుగనుంది. కమల్ హాసన్ ప్రభావం ఏ విధంగా ఉంటుందనే విషయం కూడా తేలి పోనుంది. రాష్ట్ర రాజకీయాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించినందున తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని కమల్ ఇదివరకే ప్రకటించారు.