చెదురుమదురు ఘటనలు..ఈవీఎంల మొరాయింపులు! ప్రశాంతంగా ముగిసిన రెండో విడత!
న్యూఢిల్లీ: చెదురు మదురు ఘటనలు మినహా దేశవ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సజావుగా సాగడానికి ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. మొత్తం 95 లోక్ సభ నియోజకవర్గాలతో పాటు ఒడిశాలో 35 అసెంబ్లీ స్థానాలు, తమిళనాడులో 18 శాసనసభ సీట్లల్లో ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. అస్సోం, బిహార్, చత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిషా, పుదుచ్చేరి, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లలో కొన్ని లోక్సభ స్థానాల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ఆరంభమైంది. చాలా చోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయించినట్లు వార్తలు వచ్చాయి. మాక్ పోలింగ్ సందర్భంగా కూడా అవాంతరాలు ఏర్పడినప్పటికీ.. సాంకేతిక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన వాటిని సరిచేశారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రశాంతం..
తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ పూర్తి కాగా, 28 సీట్లు ఉన్న కర్ణాటకలో రెండో దశల్లో చేపట్టారు. కర్ణాటకలో తెలుగింటి ఆడపడచు, సీనియర్ నటి సుమలత, నటుడు ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తోన్న మండ్య, బెంగళూరు సెంట్రల్ సహా 14 స్థానాలకు గురువారం ముగిసింది. మిగిలిన 14 సీట్లల్లోఈ నెల 23వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. షెడ్యూల్ ప్రకారం.. తమిళనాడులో వేలూరులో రెండో విడత ఎన్నికను నిర్వహించాల్సి ఉండగా.. అక్కడ రద్దు చేశారు. దీనితో పాటు త్రిపుర తూర్పు స్థానం శాంత్రభద్రతల కారణంగా వాయిదా వేసింది ఎన్నికల సంఘం. అస్సోంలో కరీంగంజ్, సిల్చార్, అటానమస్ డిస్ట్రిక్ట్, మంగళడోయ్, నవగాంగ్ స్థానాలకు పోలింగ్ ముగిసింది. బిహార్లో కృష్ణగంజ్, కతిహార్, పూర్ణియా, భాగల్పూర్, బాంకా స్థానాల్లో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. మావోయిస్టులకు గట్టి పట్టు ఉన్న చత్తీస్ గఢ్ లో రాజ్నంద్ గావ్, మహాసముంద్, కంకేర్ స్థానాలకు ఓటింగ్ నిర్వహించారు. జమ్ముకశ్మీర్లో రెండు స్థానాలు శ్రీనగర్, ఉదంపూర్ సీట్లల్లో పోలింగ్ పూర్తయింది.
పశ్చిమ బెంగాల్ లో హింసాత్మకం..
పశ్చిమ బెంగాల్ లోని రాయ్ గంజ్ నియోజకవర్గంలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఓ పోలింగ్ కేంద్రంలోనికి ప్రవేశించిన కొందరు వ్యక్తులు ఈవీఎంలను ధ్వంసం చేశారు. పోలింగ్ కేంద్రం బయటికి తీసుకొచ్చి, పగులగొట్టారు. సీపీఎం అభ్యర్థి సలీం, కాంగ్రెస్ అభ్యర్థిని దీపా దాస్ మున్షీ కార్లపై దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేశారు. అల్లరి మూకలను అదుపు చేేయడానికి పోలీసుల లాఠీ చార్జీ చేశారు. ఆ సందర్భంగా ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టడానికి భద్రత బలగాలు గాల్లోకి కాల్పులు జరిపారు. దీనితో పాటు- డార్జిలింగ్లో గుర్తు తెలియని వ్యక్తులు పోలింగ్ కేంద్రంపై పెట్రోబాంబులు విసిరారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్ షహర్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ లోకి పార్టీ కండువా ధరించి వెళ్లిన బీజేపీ అభ్యర్థి భోలా సింగ్ ను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. కాగా, కర్ణాటకలో ప్రతిష్ఠాత్మకమైన మండ్య నియోజకవర్గంలో కూడా స్వల్పంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోన్న ప్రముఖ నటి సుమలత మద్దతుదారులు, జనతాదళ్ (ఎస్) అభ్యర్థి నిఖిల్ గౌడ వర్గీయుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఫలితంగా అక్కడ కొద్దిసేపు పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది.
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..
పోలింగ్ సందర్భంగా ప్రముఖులు అందరూ తొలి రెండు గంటల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, రజినీకాంత్, కమల్ హాసన్ ఆయన కుమార్తె, నటి శృతిహాసన్, తమిళ నటులు విజయ్, అజిత్ సహా పలువురు ప్రముఖులు ఓటు వేశారు. తొలిసారిగా 159 మంది మానసిక వికలాంగులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం చెప్పుకోదగ్గ విశేషం. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆయన కుమారుడు యతీంద్ర మైసూరులోని వరుణ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ హాసన నియోజకవర్గంలో తన భార్యతో కలిసి ఓటు వేశారు. ఇక్కడ ఆయన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తున్నారు. రామనగరలో కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి కుమారస్వామి ఓటువేశారు. చెన్నై తేనంపేటలో డీఎంకే చీఫ్ స్టాలిన్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఓటు వేసిన ప్రముఖుల్లో ఉన్నారు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ బెంగళూరులోని జయనగరలో, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం శివగంగ జిల్లాలోని కరైకల్ లో ఓటు వేశారు.
రెండో దశ ప్రముఖులు వీరే..
రెండో దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల జాబితా పెద్దదే. సినీ నటులు సుమలత, ప్రకాశ్ రాజ్, హేమామాలిని, నిఖిల్ గౌడ వంటి నటులు ఈ జాబితాలో ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజర్ భార్య కూడా మక్కళ్ నీధి మయ్యం అభ్యర్థినిగా చెంగల్ పట్లు నియోజకవర్గం నుంచి పోటీలో చేశారు. మాజీ ప్రధాని దేవేగౌడ, స్టాలిన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వంటి హేమాహేమీల భవితవ్యం ఏమిటో ఈ దశ ఎన్నికల్లోనే స్పష్టం కానుంది.