అధికారులు వచ్చేసరికి పెట్రోల్ పంపే మాయం.. అయినా వదల్లేదు.. తాట తీశారు
ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో ఓ పెట్రోలు బంకు సోమవారం రాత్రి ఉన్నపళంగా ఆగిపోయింది. అందులో పంపింగ్ మెషీన్ అయితే క్షణాల్లో మాయమైపోయింది.
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో ఓ పెట్రోలు బంకు సోమవారం రాత్రి ఉన్నపళంగా ఆగిపోయింది. అందులో పంపింగ్ మెషీన్ అయితే క్షణాల్లో మాయమైపోయింది. అంతలోనే బంకు ముందర ''పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి'' అంటూ ఓ బోర్డు ప్రత్యక్షమైంది... ఆగమేఘాల మీద జరిగిన ఈ తంతుపై ఆరా తీసిన జనాలు అసలు విషయం తెలిసి నవ్వుకున్నారు.
పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మోసాలపై అధికారులు తనిఖీలు చేపడుతున్నారని తెలిసి ఓ పెట్రోల్ బంక్ యజమాని చేసిన హడావిడి ఇది.... అతడొక్కడే కాదు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది యజమానులు పెట్రోల్ డిస్పెన్సింగ్ మెషీన్లను దాచేసి ''పునర్నిర్మాణ'' బోర్డులు పెట్టేశారు.
అయినా సరే... స్పెషల్ టాస్క్ఫోర్స్ అధికారులను వదిలిపెట్టలేదు. దాచిపెట్టిన మెషీన్లను కూడా బయటికి తీయించి మరీ తనిఖీలు చేశారు. వాటిలో చిప్లు పెట్టినట్టు గుర్తించి తీసివేయించారు. ఇలా మోసాలు చేస్తున్న 9 పెట్రోల్ బంకులను సీజ్ చేయడంతోపాటు 23 మందిని అరెస్టు చేశారు. అందులో నలుగురు యజమానులు కూడా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్లో వారం రోజులుగా విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు... రిమోట్ కంట్రోల్ చిప్ల ద్వారా పెద్ద ఎత్తున పెట్రోల్ చౌర్యం జరుగుతున్నట్టు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6 వేల పెట్రోలు స్టేషన్లుండగా... 1000 బంకుల్లో చిప్లు అమర్చినట్టు భావిస్తున్నారు. రోజుకు రూ.15 లక్షల విలువైన పెట్రోలు చోరీకి గురువుతున్నట్టు సమాచారం.
కస్టమర్లను మోసం చేయడానికి వీలుగా పెట్రోల్ బంకుల్లో ఇలాంటి చిప్లు అమర్చుతున్నారనీ.. పైకి మామూలుగా పోస్తున్నట్టు అంకెలు చూపిస్తూనే దాదాపు 100 మిల్లీ లీటర్లకు పైబడి నొక్కేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.