విజయ్ మాల్యాను రప్పించేందుకు రహస్య ప్రయత్నాలు-సుప్రీంకు తెలిపిన కేంద్రం...
బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి లండన్లో తిష్టవేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను స్వదేశానికి తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే లండన్ కోర్టుల్లో న్యాయప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతున్న నేపథ్యంలో తెరవెనుక అప్పగింత ప్రక్రియను పూర్తిచేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
విజయ్ మాల్యాను భారత్ రప్పించేందుకు రహస్యంగా అప్పగింత ప్రయత్నాలు కేంద్రం ఇవాళ సుప్రీంకోర్టుకు తెలిపింది. వాటి తాజా పరిస్ధితి మాత్రం తెలియదని స్పష్టం చేసింది. ఈ చర్యల్లో తాము భాగస్వామి కాదని కూడా సుప్రీంకోర్టుకు వెల్లడించింది. కేంద్రం వాదనలు విన్న జస్టిస్ లలిత్, అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఆ రహస్య అప్పగింత చర్యలేంటో చెప్పాలని మాల్యా తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
Recommended Video
భారత్లో లిక్కర్, ఎయిర్లైన్స్తో పాటు పలు వ్యాపారాలు చేసిన మాల్యా.. మోడీ సర్కారు హయాంలోనే దర్జాగా లండన్ పారిపోయాడు. అప్పటి నుంచి మాల్యాను వెనక్కి రప్పించేందుకు మోడీ సర్కారు ప్రయత్నాలు చేస్తున్నట్లు కోర్టులకు చెబుతూనే ఉంది. దీంతో అసలు ఈ ప్రక్రియ ఎంతవరకూ వచ్చిందో తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు ఇవాళ వివరాలు కోరింది. అయితే మాల్యాను రహస్యంగా రప్పించే ప్రక్రియలో తాను భాగస్వామిగా లేనని చేతులెత్తేసింది. దీంతో మాల్యా న్యాయవాదిని ఆ వివరాలు ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం కోరాల్సి వచ్చింది. త్వరలో ఈ వివరాలు సుప్రీంకోర్టుకు అందనున్నాయి. వీటి ఆధారంగా తదుపరి విచారణ కొనసాగుతుందని కోర్టు పేర్కొంది.