లేఖలు దొరికాయి, రాజీవ్ గాంధీ హత్య తరహాలో మోడీ హత్యకు కుట్ర: పోలీసులు
ముంబై: రాజీవ్ గాంధీలా ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు మావోయిస్టులు కుట్రపన్నారని, ఇందుకు సంబంధించి లేఖ దొరికిందని మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పాటు పుణెకు సమీపంలోని భీమా కోరెగావ్ గ్రామంలో జరిగిన హింస కేసులో విరసం నేత వరవరరావు సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి మహారాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
'అరెస్ట్ చేసిన పౌరహక్కుల నేతలకు, మావోయిస్టులకు సంబంధాలు ఉన్నట్లు రుజువులు ఉన్నాయి. మోడీ రాజ్ను అంతం చేసేందుకు రాజీవ్ గాంధీ తరహాలో మోడీని హత్య చేయాలని ప్రణాళికలు వేసినట్లు అరెస్టు అయిన పౌరహక్కుల నేతకు, మావోయిస్టులకు మధ్య లేఖల ద్వారా సంభాషణ జరిగింది. గ్రెనేడ్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వాల్సిందిగా ఆ లేఖలో ఉంది. పౌరహక్కుల నేతల దగ్గర నుంచి కొన్ని వందల లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.' అని తెలిపారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. అందులో కొన్ని లేఖలు అరెస్టయిన నేతలు, మావోయిస్టులకు మధ్య చేతులు మారాయని, అధికారుల దృష్టిని ఆకర్షించాలంటే ఏదో ఒక పెద్ద ప్లాన్ వేసేందుకు ప్రణాళికలు వేసుకున్నట్లు లేఖలో ఉందని, స్వాధీనం చేసుకున్న డిస్క్ల్లో ఒక రాకెట్ లాంచర్ పాంప్లెట్ లభ్యమైందని తెలిపారు.
కాగా, అరెస్టైన వారిని జైల్లో పెట్టవద్దని సెప్టెంబర్ 6వ తేదీ వరకు హౌస్ అరెస్టులో ఉంచాలని సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం ఆదేశాలు ఇచ్చింది. దీంతో వరవరరావు సహా వారిని వారి ఇళ్లకు తరలించారు. ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.