కీలక పత్రాలు చోరీ: రాఫెల్ ఇష్యూలో సుప్రీం కోర్టులో బాంబుపేల్చిన అటార్నీ జనరల్
న్యూఢిల్లీ: రాఫెల్ డీల్ వ్యవహారంలో పునఃసమీక్షపై సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. రాఫెల్ ఒప్పందాన్ని రద్దు చేయాలని గతంలో పిటిషన్ దాఖలైంది. దీనిని గత ఏడాది డిసెంబర్ 14వ తేదీన కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ సమయంలో ఒప్పందాన్ని సవాల్ చేస్తూ వచ్చిన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిని అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారించింది.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ బాంబు పేల్చారు. రక్షణ శాఖ నుంచి కీలక పత్రాలు చోరీకి గురయ్యాయని చెప్పారు. ఈ చోరీకి గురైన పత్రాలపై విచారణ ఎంత వరకు వచ్చిందో చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. రాఫేల్ ఒప్పందం పత్రాలు చోరీకి గురయ్యాయని, దానిపై విచారణ జరుగుతోందని చెప్పారు. రాఫేల్ ఒప్పందానికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలను ఇటీవల ద హిందూ పత్రిక ప్రచురించింది. దీనిని ఆయన ఉదహరించారు. రాఫేల్ ఒప్పందానికి సంబంధించిన కీలక పత్రాలు ఇటీవల రక్షణ శాఖ నుంచి చోరీకి గురయ్యాయని, అధికారిక రహస్యాల చట్టం ప్రకారం ఇలాంటి పత్రాలు ఉంచుకోవడం నేరమని, దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ప్రస్తుతం రివ్యూ పిటిషన్లను కొట్టివేయాలని ఏజీ సుప్రీం కోర్టును కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ స్పందిస్తూ.. పత్రాల చోరీపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మధ్యాహ్నం రెండు గంటలకు కోర్టుకు వెల్లడించాలన్నారు.
ఎన్ని దోమలు చనిపోయాయో లెక్కిస్తానా?: విపక్షాలకు వీకే సింగ్, డిగ్గీరాజాపై ఆగ్రహం
అంతకుముందు, సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. డిసెంబరు 14, 2018న రాఫేల్పై ఇచ్చిన తీర్పులో చాలా తప్పిదాలు ఉన్నాయని, తప్పుడు సమాచారం ఇచ్చి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కాగా, రివ్యూ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, అరుణ్ శౌరీ తదితరులు ఉన్నారు.