కరోనా: లాక్డౌన్ పొడగింపు ఖాయం.. అధికారిక ఉత్తర్వులు జారీ.. సెప్టెంబర్ దాకా తప్పదా?
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ ప్రక్రియలో మనమిప్పుడు సరిగ్గా మధ్యలో ఉన్నాం. లాక్ డౌన్ ముగింపునకు ఇంకా తొమ్మిదిరోజుల టైముంది. కానీ ఇటీవల పాజిటివ్ కేసుల సంఖ్య రెండితలు, మూడింతలు పెరగడం.. మరణాల సంఖ్య 100 దాటడంతో.. ప్రమాదం మరింత పెద్దది కాకుండా ఉండేలా లాక్ డౌన్ పొడగించొచ్చనే వాదన తెరపైకొచ్చింది. ఇప్పటిదాకా దీనిపై చర్చమాత్రమే కొనసాగాగ.. మొదటిసారి లాక్ డౌన్ పొడగింపుపై అధికారిక ఆదేశాలు వెలువడ్డాయి.
Recommended Video
ఈనెల 30 దాకా సెక్షన్ 144..
దేశరాధాని ఢిల్లీ ఢిల్లీలో ఇప్పటికే కొవిడ్-19 కేసుల సంఖ్య 445కు చేరింది. ఢిల్లీని ఆనుకుని ఉన్న గురుగ్రామ్, నోయిడా లాంటి మెగాసిటీల్లోనూ వైరస్ ప్రభావం విపరీతంగా ఉంది. ఉత్తరప్రదేశ్ లో 234 కేసులులకుతోడు హర్యానాలోనూ రోగుల సంఖ్య పెరుగుతున్నది. దాదాపు దేశంలోని ప్రముఖ వ్యాపార, వాణిజ్య సంస్థల హెడ్ క్వార్టర్స్ అన్నీ నోయిడాలో కేంద్రీకృతమై ఉన్నాయి. వైరస్ ప్రభావం తగ్గకుండా లాక్ డౌన్ ఎత్తేస్తే అక్కడ పెనువిపత్తు తలెత్తే ప్రమాదముందని భావించిన గ్రేటర్ నోయిడా అధికారులు.. ఈనెల 30 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని, అదే సమయంలో సెక్షన్ 144 కూడా కొనసాగుతుందని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. అదేబాటలో..
మహారాష్ట్ర సైతం..
మన దేశంలో కరోనా వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రమేదైనా ఉదంటే.. ప్రస్తుతానికది మహారాష్ట్రనే. పాజిటివ్ కేసులతోపాటు మరణాల సంఖ్యలోనూ ఆ రాష్ట్రమే టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నది. ఆదివారం కొత్తగా మరో 55 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం సంఖ్య 690కి పెరిగింది. అక్కడ ఇప్పటిదాకా 52 మంది చనిపోయారు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను పొడగించాలని ఉద్ధవ్ ఠాక్రే సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. కొనసాగింపు ఖాయమైనప్పటికీ.. అది ఎప్పటి వరకు ఉంటుందనే దానిపై ఒకటిరెండు రోజుల్లో ప్రకటన వెలువడుతుందని ప్రభుత్వ వరర్గాలు తెలిపాయి.
ధారావీలో మరో కేసు..
కరోనా ప్రభావానికి దేశ ఆర్థిక రాజధాని ముంబై వణికిపోతున్నది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావీలో మరొకరిని కరోనా కాటేసింది. లక్షల మంది పేదలు దగ్గర దగ్గరగా నివసించే ధారావీలో వైరస్ వ్యాప్తి పెరిగితే అది ఉప్పెనలాంటి పరిస్థితికి దారితీస్తుంది. దీంతో అధికారులు ఆ ప్రాంతంపై గట్టి ఫోకస్ పెట్టారు. ధారావీలో గతవారంలో ఓ కొవిడ్-19 పేషెంట్ చనిపోగా, ఆ ప్రాంతంలో పారిశుద్ద్య పనులు చేసిన ఓ కార్మికుడికి కూడా వైరస్ సోకింది. తాజాగా ఓ 21 ఏళ్ల వ్యక్తి కరోనా కాటుకు గురయ్యాడు. ఏప్రిల్ 21లోపు కేసుల సంఖ్య తగ్గుముఖంపడుతుందన్న ఆశలేవీ లేనందునే ప్రభుత్వం లాక్ డౌన్ కొనసాగింపునకు మొగ్గుచూపిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు..
సెప్టెంబర్ దాకా లాక్ డౌన్?
నోయిడాలో లాక్ డౌన్ కొనసాగింపునకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మిగతా రాష్ట్రాలు కూడా అనుసరించడం అనివార్యంగా మారింది. అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్యతోపాటు మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 3800 కేసులు నమోదయ్యాయి. రాత్రిలోగా ఆయా రాష్ట్రాలు ప్రకటించే సంఖ్యను బట్టి ఇది 5వేలకు చేరుకున్నా ఆశ్యర్యపోనవసరంలేదు. ఇండియాలో కరోనా లాక్ డౌన్ తక్కువలో తక్కువ జూన్ రెండో వారం దాకా.. ఎక్కువలో ఎక్కువ సెప్టెంబర్ రెండో వారం దాకా కొనసాగొచ్చిన ప్రఖ్యాత అధ్యయన సంస్థ ‘బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్' తన స్టడీ రిపోర్టులో పేర్కొంది.
ఎత్తేస్తే అంతే సంగతులు..
చైనాలో వైరస్ పుట్టిన హుబే ఫ్రావిన్స్ లో లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా సుమారు 25వేల వైద్య బృందాలు 24X7 పని చేస్తున్నాయి. అయినప్పటికీ వేలాదిగా కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేదల సంఖ్య ఎక్కువగా ఉన్న ఇండియాలో లాక్ డౌన్ ఎత్తివేత ప్రమాదకర పరిస్థితులకు దారితీయొచ్చని బోస్టన్ తోపాటు పలు అధ్యయన సంస్థలు నివేదించాయి. వైరస్ ను నియంత్రించేంత స్థాయిలో దేశ హెల్త్ సెక్టార్ సన్నద్ధంగా లేకపోవడమే అందుకు కారణమని తెలిపాయి. పేదలను, చిన్న, మధ్యతరహా కంపెనీలను ఆదుకునేందుకు ఇప్పటికే పలు పథకాల్ని ప్రకటించిన కేంద్రం.. లాక్ డౌన్ కొనసాగే పక్షంలో ఏం చేయాలనేదానిపై కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. ఏదిఏమైనా నోయిడా, మహారాష్ట్రలాగా అధికారిక ప్రకటనలు వచ్చేదాకా లాక్ డౌన్ వార్తలు వేటినీ విశ్వసించడానికి వీల్లేదు.