అయోధ్యలో ఏం జరుగుతోంది? 144 సెక్షన్ విధింపు..రెండు నెలల పాటు!
న్యూఢిల్లీ: దశాబ్దాల తరబడి న్యాయస్థానాల్లో నానుతూ వస్తోన్న అత్యంత సున్నితమైన, హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదానికి ఇక దాదాపు తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో అయోధ్యలో క్రమంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం.. మరో మూడు రోజుల్లో తన తుది తీర్పును వెలువరించనుంది. ఈ నెల 17వ తేదీ నాటికి రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై తుది విచారణను ముగిస్తామంటూ ఇదివరకే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ స్పష్టం చేశారు.
పండుగలకూ 144 సెక్షన్ వర్తింపు..
గడువు సమీపిస్తున్న కొద్దీ అయోధ్యలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా పరిపాలనా యంత్రాంగం ముందు జాగ్రత్తలు తీసుకుంది. అయోధ్యలో 144 సెక్షన్ విధించింది. సుదీర్ఘకాలం పాటు కొనసాగబోతోంది. డిసెంబర్ 10వ తేదీ వరకు అమల్లో ఉండేలా 144 సెక్షన్ ను అమలు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనూజ్ కుమార్ ఝా తెలిపారు. ఈ మధ్యకాలంలో అయోధ్య పరిసర ప్రాంతాల్లో నిర్వహించే పండుగలు, ఉత్సవాలను కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో ఎలాంటి ఉత్సవాలు గానీ, పండుగలు గానీ నిర్వహించినప్పటికీ.. ప్రజలు గుమికూడ రాదని వెల్లడించారు.
డెడ్ లైన్.. 17
రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై తుది విచారణను పూర్తి చేయడానికి సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించుకున్న విషయం తెలిసిందే. 17వ తేదీన చోటు చేసుకునే వాదోపవాదాలే.. తుది విచారణ అవుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ వెల్లడించారు. ఇప్పటిదాకా 37 సార్లు సుప్రీంకోర్టు ఈ కేసుపై వాదోపవాదాలను ఆలకించింది. అయినప్పటికీ.. ఇది ఓ కొలిక్కి రాలేదు. శుక్రవారం కూడా ఈ కేసు సుప్రీంకోర్టు సమక్షానికి విచారణకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలో ఏర్పాటైన అయిదు మంది సభ్యులు ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. రంజన్ గొగొయ్ సహా న్యాయమూర్తులు ఎస్ ఏ బొబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ ఏ నజీర్ ఇందులో సభ్యులుగా ఉన్నారు.
నేటి నుంచి కీలక విచారణ
రామజన్మభూమి-బాబ్రీ మసీదు విషయంలో సుప్రీంకోర్టు సోమవారం నుంచి కీలక వాదోపవాదాలను ఆలకించనుంది. సోమ, మంగళ, బుధ వారాల్లో ముస్లిం కమిటీలు, హిందూ సంఘాలకు తమ వాదనలను వినిపించే అవకాశాన్ని కల్పించింది. ఈ రెండు సంఘాల ప్రతినిధుల నుంచి అందిన విజ్ఞప్తులను బేరీజు వేసుకుని.. గురువారం తుది విచారణను నిర్వహిస్తామని రంజన్ గొగొయ్ స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అయోధ్యలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఎలాంటి తీర్పునైనా స్వాగతించడానికి అన్ని వర్గాల ప్రజలు సంసిద్ధంగా ఉండాలని రాజకీయ నాయకులు కోరుతున్నారు.