జనతా కర్ఫ్యూ : సీఎం కేసీఆర్ బాటలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ ఆదివారం(మార్చి 22) దేశవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కర్ఫ్యూని 24గంటలకు పొడగించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పుడు ఇదే బాటలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కూడా అక్కడ కర్ఫ్యూని పొడగించారు.
సోమవారం ఉదయం 6గంటల వరకు జనతా కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం 6గంటల నుంచి మార్చి 31 వరకు 144 సెక్షన్ అమలవుతుందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రజా రవాణా సాధనాలను మార్చి 31 వరకు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూని మరో రెండు రోజులు పొడగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్చి 31 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే దేశవ్యాప్తంగా 75 జిల్లాలను పూర్తిగా లాక్ డౌన్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 340 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఏడుగురు మృత్యువాత పడ్డారు. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.
CM Uddhav Balasaheb Thackeray addressing the State https://t.co/iTiVPFcC5F
— CMO Maharashtra (@CMOMaharashtra) March 22, 2020