మైండ్ బ్లాక్ : "నమస్తే ట్రంప్" కార్యక్రమానికి భారీ భద్రత..ఎవరెవరు వస్తున్నారంటే...?
Recommended Video
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన పర్యటించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అహ్మదాబాదులో ల్యాండ్ అవనున్న ట్రంప్ దంపతులకు భారీ భద్రతను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. విమానాశ్రయం నుంచి మొతేరా స్టేడియం వరకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడమే కాకుండా అడుగు అడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్లో కన్ను తిప్పకుండా ప్రతిక్షణం డేగకన్ను వేసి ఉంది పోలీస్ శాఖ.
చీమ చిటుక్కుమన్న ఇట్టే పసిగడతారు
ఫిబ్రవరి 24వ తేదీన మధ్యాహ్నం ట్రంప్ దంపతులు అహ్మదాబాదులో ల్యాండ్ అవుతారు. విమానాశ్రయం నుంచి నేరుగా మొతేరా క్రికెట్ స్టేడియంకు చేరుకుని అక్కడ నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ క్రమంలోనే అక్కడ భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. కొన్ని చోట్ల పోలీస్ కంట్రోల్ రూమ్ వ్యాన్లను ఏర్పాటు చేసింది అహ్మదాబాద్ పోలీస్ శాఖ. వీటికి తోడు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బస్సులు, నిత్యం పహారా కాస్తున్నాయి. ఇప్పటికే విమానాశ్రయంకు కొద్ది దూరంలో ఉన్న ఇందిరా బ్రిడ్జ్పై 20పీసీఆర్ వ్యాన్లతో కూడిన కాన్వాయ్ మాక్ డ్రిల్ నిర్వహించింది. ఇక నీలం దుస్తులు ధరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు రోడ్లపై కవాతు చేస్తున్నాయి. సర్దార్ వల్లభాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సమీపంలోని నివాస ప్రాంతాల మధ్య కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు మార్చ్ నిర్వహిస్తున్నాయి.
ఇప్పటికే అహ్మదాబాద్ను జల్లెడ పట్టిన అమెరికా సీక్రెట్ సర్వీస్
గురువారం రోజున అమెరికాకు చెందిన సీక్రెట్ సర్వీస్, ఎస్పీజీ, ఎన్ఎస్జీ కమాండోలు ఇప్పటికే అహ్మదాబాదుకు చేరుకుని అక్కడ భద్రతా ఏర్పాట్లపై స్థానిక పోలీసులతో సమీక్ష నిర్వహించారు. గురువారం రోజున సబర్మతీ ఆశ్రమం, మొతేరా స్టేడియం, విమానాశ్రయ పరిసరాల్లో ఈ బలగాలు రెక్కీ నిర్వహించాయి. ఇక అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి సబర్మతీ ఆశ్రమం ఆపై మొతేరా స్టేడియం వరకు అంటే 22 కిలోమీటర్ల మేరా రోడ్ షో జరగనుంది. ఇక్కడే బలగాలకు పెద్ద సవాల్ ఎదురుకానుంది.
నమస్తే ట్రంప్ కార్యక్రమానికి 1.25 లక్షల మంది
ఇక మొతేరా స్టేడియంలో జరగనున్న నమస్తే ట్రంప్కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 1.25 లక్ష మంది ఈ కార్యక్రమానికి వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇందులో బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయనాయకులు, బిజినెస్ లీడర్స్, ఎన్ఆర్ఐలతో పాటు విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. వీరంతా అహ్మదాబాదుకు ఉదయమే చేరుకుంటారు. ఇక ఈ సమావేశంలో టీమిండియా మాజీ కెప్టెన్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పాల్గొంటారు. అహ్మదాబాదులో తను ఆడిన క్రికెట్కు సంబంధించిన జ్ఞాపకాలను ఈ సందర్భంగా నెమరేసుకున్నారు గంగూలీ.
నమస్తే ట్రంప్ కార్యక్రమానికి రూ.100 కోట్లు
ఇక క్రికెట్ పిచ్కు పైన 40 అడుగుల వేదికను నిర్మించారు. ప్రత్యేక ద్వారం నుంచి ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్లు ఈ వేదికపైకి చేరుకుంటారు. ఈ వేదిక పక్కనే 10వేల మంది వీవీఐపీలు కూర్చునేలా ఏర్పాటు చేశారు. బార్కోడ్లు కలిగి ఉన్న ఇన్విటేషన్ కార్డులను ఇంకా అతిథులకు పంపాల్సి ఉంది. ఆ బార్కోడ్లోనే తమ సీటు నెంబరు కేటాయించడం జరుగుతుంది. ఇక నమస్తే ట్రంప్ కార్యక్రమానికి రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో 20 కోట్లు దాదాపు రోడ్ల మరమత్తులకే ఖర్చు చేసింది.
11వేల మంది పోలీసులతో బందోబస్తు
ఇక సబర్మతీ ఆశ్రమంకు ట్రంప్ వెళతారా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. షెడ్యూల్లో ఉండటంతో తాము ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆశ్రమం ట్రస్టీ తెలిపారు. ఇక వీఐపీలు తమ వాహనాలను కేటాయించిన పార్కింగ్లోనే పార్క్ చేయాలని మున్సిపల్ కమిషనర్ చెప్పారు. అక్కడ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ పార్కింగ్ స్థలం నుంచి స్టేడియం నాలుగు కిలోమీటర్లు ఉంటుందని వెల్లడించారు. మిగతా వారు 1.5 కిలోమీటర్ల మేరా నడవాల్సి ఉంటుందని చెప్పారు. ఇక భద్రత కోసం దాదాపు 11000 మంది పోలీసులను మోహరించారు. వీరందరినీ 10 నుంచి 15 జిల్లాలనుంచి రప్పించినట్లు సమాచారం.
అమెరికా నుంచి దిగిన ట్రంప్ సెక్యూరిటీ వాహనాలు
డ్రోన్లతో నిత్యం నిఘా ఉంచుతామని పోలీస్ శాఖ చెప్పింది. కెమెరాలు, జామర్లు ఇతర సురక్షిత వాహనాలు స్టేడియం దగ్గర ఉంటాయని పోలీస్ శాఖ వివరించింది. మంగళవారం బుధవారం నాడు అమెరికా నుంచి రెండు కార్గో విమానాలు అహ్మదాబాదులో ల్యాండ్ అయ్యాయి. ఇందులోనుంచి అమెరికా అధ్యక్షుడి సెక్యూరిటీ వాహనాలు దిగాయి.ఇక సోమవారం నాడు అహ్మదాబాద్ విమానాశ్రంయంలో విమానాలు షెడ్యూల్ ప్రకారమే నడుస్తాయని చెప్పారు అధికారులు. అయితే ట్రంప్ విమానం ల్యాండింగ్కు మ15 నిమిషాల నుంచి అరగంట పాటు ఇతర విమానాలకు అనుమతి ఉండదని ఆయన అహ్మదాబాద్ నుంచి వెళ్లేముందు కూడా ఇదే అవలంబిస్తామని విమానాశ్రయ అధికారులు చెప్పారు.