మాజీ సీఎం సహా బీజేపీ నేతల భద్రత కుదింపు: శివసేన సర్కారుపై కాషాయ పార్టీ నేతల ఫైర్
ముంబై: శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఎంఎన్ఎస్(మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన) అధినేత రాజ్ థాక్రే, కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలేలకు భద్రత తగ్గిస్తూ ఉద్ధవ్ థాక్రే సర్కారు నిర్ణయించింది.
ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించిన రెండు రోజుల తర్వాత ఈ మేరకు నిర్ణయం వెల్లడించడం గమనార్హం. వీఐపీలకు భద్రత కల్పించే అంశమై సమీక్ష నిర్వహించడం నిరంతర ప్రక్రియ. 2019లో సమీక్ష జరగగా.. కరోనా కారణంగా 2020లో నిర్వహంచలేదు.
కొందరు వీఐపీలకు తాము చేపట్టిన పదవుల కారణంగా ముప్పు పొంచి ఉంటుందని, ఒకవేళ ఆ పదవుల నుంచి వైదొలిగితే ముప్పు పరిస్థితి కూడా మారుతందని ఈ సమీక్షా సమావేశంలో ఓ సీనియర్ అధికారి తెలిపారు.
శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్(మహా అఘాడీ) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ నేత రామ్ కదమ్ ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తన పర్యటనలు, ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూదని తెలిపారు.