కాశ్మీర్ లో పుల్వామా తరహా ఉగ్రదాడికి కుట్ర: 40 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం!
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాలు శుక్రవారం పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. సుమారు 40 కేజీల పేలుడు పదార్థాలు, కొన్ని ప్రాణాంతక వస్తువులను కనుగొన్నాయి. వాటిని నిర్వీర్యం చేశాయి. జమ్మూ కాశ్మీర్ లోని కథువా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లో మరోసారి మారణ హోమానికి తెగబడటానికి అవకాశాలు ఉన్నాయంటూ వస్తోన్న వార్తల నేపథ్యంలో.. సరిహద్దు భద్రత బలగాలు కొద్దిరోజులుగా సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. కథువా జిల్లాలో నిర్వహించిన సోదాల సందర్భంగా 40 కేజీల పేలుడు పదార్థాలతో పాటు కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి.
బాలాకోట్ లో భారీగా ఉగ్రవాదులకు శిక్షణ: సరిహద్దుల్లో 500 టెర్రరిస్టులు తిష్ఠ: ధృవీకరించిన ఆర్మీ చీఫ్
పాకిస్తాన్ లోని బాలాకోట్ లో జైషె మహమ్మద్ కు చెందిన ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయని, సరిహద్దుల్లో 500 మందికి పైగా ఉగ్రవాదులు తిష్ఠ వేశారంటూ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్: వెల్లడించిన కొన్ని నిమిషాల్లోనే బీఎస్ఎఫ్ జవాన్లు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కథువా జిల్లా దిలావల్ ప్రాంతంలోని దేవల్ గ్రామ శివార్లలో బీఎస్ఎఫ్ బలగాలు నిర్వహించిన తనిఖీల్లో ఖలీల్ అనే ఓ వ్యక్తి ఇంట్లో అవి బయటపడ్డాయి. అవన్నీ స్థానికంగా తయారైన పేలుడు పదార్థాలని నిర్ధారించారు. వాటిని నిర్వీర్యం చేయడానికి బాంబు స్క్వాడ్ ను రప్పించారు. స్థానికంగా తయారైనవేనని తేలడంతో.. వాటిని రూపొందించంలో సహకరించిన వారి కోసం భద్రతా బలగాలు ఆరా తీస్తున్నాయి. అనుమానితులను ప్రశ్నిస్తున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జైషె మహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేయడానికి భారీగా పేలుడు పదార్థాలను వినియోగించిన విషయం తెలిసిందే. పేలుడు పదార్థాలను అమర్చిన వాహనంతో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై చేసిన దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులు అయ్యారు. తాజాగా- అదే తరహాలో 40 కేజీల మేర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం ప్రకంపనలు పుట్టిస్తోంది. సరిహద్దుల్లో పాకిస్తాన్ భూభాగంపై వందలాది మంది ఉగ్రవాదులు పొంచి ఉన్నారని, వారంతా భారత్ లోకి చొరబడటానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నారంటూ బిపిన్ రావత్ ప్రకటించిన కొన్ని నిమిషాల వ్యవధిలో ఇంత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.