పడవల ద్వారా చొరబడేందుకు ఉగ్రవాదుల ప్లాన్: అప్రమత్తంగా భారత బలగాలు
శ్రీనగర్: అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)ల వెంబడి పాకిస్థాన్ వైపు ఉన్న ఉగ్ర స్థావరాల సమీపంలో చిన్నపాటి రబ్బర్ పడవలు ఉన్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్లోని భారత భద్రతా బలగాలను అప్రమత్తం చేశాయి.
జమ్మూ డివిజన్లోని అఖ్నూర్, కథువా, సాంబాల్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పాకిస్థాన్ వైపు 13 రబ్బరు పడవలను గుర్తించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదులు కృష్ణఘాటీ నదిని ఉపయోగించుకుని భారత్లోకి చొరబడే ప్రమాదం ఉందని ఐబీ వర్గాలు హెచ్చరించాయి.
ఈ నేపథ్యంలో భారత భద్రతా దళాలు గురేజ్ సెక్టార్లో హై అలర్ట్ ప్రకటించాయి. ఎల్ఓసీ, సరిహద్దు వెంబడి గస్తీ దళాలను పెంచాయి. పాకిస్థాన్లో శిక్షణ పొందిన కమాండోలు, ఉగ్రవాదులు గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కచ్, సర్ క్రిక్ల గుండా చిన్న పడవల్లో మనదేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే ఐబీ హెచ్చరికలు చేసింది. తాజాగా పడవలను గుర్తించి భద్రతా దళాలను అప్రమత్తం చేసింది.