నన్ను చంపేందుకు కుట్ర, ప్రజలే అండగా ఉంటారు: రబ్రీదేవి
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు. తనను, తన కుటుంబసభ్యులకు ముప్పుందని ఆమె అభిప్రాయపడ్డారు. బీహర్ ప్రభుత్వం నుండి తన కుటుంబానికి ముప్పు ఉందని ఆమె అనుమానాలను వ్యక్తం చేశారు.
బీహర్ రాష్ట్రంలో గతంలో ఆర్జేడీ భాగస్వామిగా ఉండేది కానీ జెడి(యూ) బిజెపితో చేతులు కలిపింది. అవినితి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆర్జేడి, జెడియూల మధ్య పొత్తుకు విఘాతం ఏర్పడింది.
పశుదాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ జైలు శిక్షను అనుభవిస్తున్నారు. మరోవైపు లాలూ కుటుంబసభ్యులపై ఇటీవల కాలంలో సోదాలు కూడ జరిగాయి తాజాగా రబ్రీ నివాసంలో కూడ సోదాలు నిర్వహించారు.
ఈ తరుణంలో రబ్రీదేవి చేసిన వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి. రబ్రీదేవి నివాసం నుండి భద్రతను ఉపసంహరించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో సెక్యూరిటీని ఎత్తేశారని ఆమె చెప్పారు.
ప్రభుత్వం ఏమి చేస్తోందో? నన్ను, నా కుటుంబానికి చంపేందుకు కుట్ర చేస్తోందని ఆమె ఆరోపణలు చేశారు. భద్రతను ఉపసంహరించడంపై తాను భయపడే ప్రసక్తే ఉండదని చెప్పారు. ఈ విషయమై తాను ప్రజల్లోకి వెళ్ళనున్నట్టు ఆమె చెప్పారు. ప్రజలే తనకు భద్రతను కల్పిస్తారనే ధీమాను ఆమె వ్యక్తం చేశారు.
ప్రజలంతా తన పక్కన ఉన్నారని ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్దాలు ఆడుతోందని ఆమె విమర్శించారు. రబ్రీదేవి నివాసం నుండి భద్రతను ఉపసంహరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహర్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలోనే నితీష్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది. రబ్రీదేవి నివాసం ఉన్న 32 మిలటరీ భద్రతను రాష్ట్రప్రభుత్వం ఉప సంహరించుకొంది.