హాట్హాట్గా కేబినెట్: సీమాంధ్రలో నేతల ఇళ్ల వద్ద భద్రత
న్యూఢిల్లీ/న్యూఢిల్లీ: కేంద్రమంత్రి వర్గ సమావేశం హాట్ హాట్గా సాగుతోంది. రెండుగంటలుగా భేటీ కొనసాగుతోంది. మంత్రివర్గం పది జిల్లాల తెలంగాణకే మొగ్గు చూపుతోందని సమాచారం. అయితే సీమాంధ్ర మంత్రులు మాత్రం సమైక్యం, హైదరాబాదు యూటి, రాయల తెలంగాణ కోసం పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. చర్చ జరుగుతున్న సమయంలో కమల్నాథ్ గంటా యాభై నిమిషాల తర్వాత బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణపై చర్చ జరుగుతోందని చెప్పారు. తెలంగాణలో అనంతపురం, కర్నూలు జిల్లాలను కలపాల వద్దా అనే అంశంపై చర్చ సాగుతోంది.
కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ నుండి జైపాల్ రెడ్డి, కావూరి సాంబశివ రావు, కిషోర్ చంద్రదేవ్, పళ్లం రాజులు పాల్గొన్నారు. కావూరి, పళ్లంలు మొదట సమైక్యవాదం కోసం పట్టుబట్టారు. ససేమీరా అనడంతో హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కోరారు. సమైక్యం లేదా హైదరాబాద్ యూటి అని నేతలు పట్టుబడ్టటంతో సమావేశం కాస్త హాట్ హాట్గా జరిగింది. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాజీనామాకు సైతం సిద్ధమని వారు తెలిపారు. కావూరి రాయల తెలంగాణ కోసం కూడా పట్టుబడుతున్నట్లుగా సమాచారం.
కాంగ్రెసు నేతల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు
విభజనపై కేంద్రమంత్రివర్గం నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ అప్రమత్తమైంది. సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధుల నివాసాల వద్ద పోలీసు శాఖ భద్రతను కట్టుదిట్టం చేసింది. అనంతపురంలో పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయని తెలుస్తోంది. ఎపిఎస్పీ, పారామిలటరీ దళాలు వచ్చాయి.
సీనియర్ ఐపిఎస్ అధికారులు జిల్లాల్లోనే మకాం వేశారు. కాంగ్రెసు పార్టీ కార్యాలయాల వద్ద బందోబస్తు పెట్టారు. ప్రజాప్రతినిధుల ఇంటికి వెళ్లి వచ్చే వారిపై నిఘా ఉంచారు. గుంటూరులో మంత్రి కన్నా, తెనాలిలో స్పీకర్ నాదెండ్ల ఇళ్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. చిత్తూరు ఎంపి చింతా మోహన్, కేంద్రమంత్రులు రాయపాటి, కావూరి, పనబాక, రాష్ట్ర మంత్రి ఆనం, బిజెపి నేత వెంకయ్య నాయుడు ఇళ్ల వద్ద భద్రత పెంచారు.