ఆనాటి ఎమర్జెన్సీపై సుప్రీంలో 94ఏళ్ల వృద్దురాలి పిటిషన్... రూ.25కోట్లు పరిహారం ఇప్పించాలని...
1975లో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని రాజ్యాంగ విరుద్దంగా ప్రకటించాలని కోరుతూ 94 ఏళ్ల ఓ వితంతువు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాదు,ఎమర్జెన్సీని అమలుచేసిన అధికారుల నుంచి పరిహారంగా తనకు రూ.25 కోట్లు ఇప్పించాలని పిటిషన్లో కోరింది. పిటిషనర్ తరుపున న్యాయవాదులు డా.నీలా గోఖలే,డా.అనన్య ఘోష్ ఈ పిటిషన్ను సుప్రీం కోర్టులో దాఖలు చేశారు.అప్పటి ఎమర్జెన్సీ కారణంగా ఆమె,ఆమె కుటుంబం అనుభవించిన వేదనకు న్యాయం జరగాలని పిటిషన్లో పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులను పిటిషన్లో గుర్తుచేసిన ఆమె.. ఆనాటి అధికారులు గృహాలను,వ్యాపారులను దోచుకున్నారని ఆరోపించారు. నిర్బంధ పరిస్థితుల నుంచి బయటపడేందుకు తాము దేశం విడిచి పారిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 'నా భర్త వ్యాపారం మూతపడింది... స్థిరాస్తులతో సహా అన్ని ఆస్తులు,విలువైన వస్తువులన్నీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగా నా భర్త మరణించారు. అప్పటినుంచి ఎమర్జెన్సీ కాలంలో నా భర్తపై మోపిన అభియోగాలను ఒంటిచేత్తో ఎదుర్కొంటున్నాను.' అని పిటిషన్లో చెప్పుకొచ్చారు.
2014లో ఢిల్లీ హైకోర్టు.. మరణించిన తన భర్తపై మోపిన అభియోగాలను ఎట్టకేలకు కొట్టిపారేసిందని చెప్పారు. అయితే ఎమర్జెన్సీ సమయంలో అధికారులు జప్తు చేసిన కోట్ల రూపాయల తన భర్త ఆస్తులను ఇంకా తిరిగి ఇవ్వలేదని పేర్కొన్నారు.'ఎమర్జెన్సీ సమయంలో అధికారులు చట్ట విరుద్దంగా,అక్రమంగా విలువైన చరాస్తులను,విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అత్యంత దారుణమేంటంటే... అలా స్వాధీనం చేసుకున్నవాటిల్లో తన తల్లి నగలు కొన్నింటిని ఢిల్లీ షాపుల్లో విక్రయానికి పెట్టడం చూసి ఆమె కొడుకు షాక్ తిన్నాడు.' అని పిటిషనర్ తరుపు న్యాయవాది పేర్కొన్నారు.
ఇంత వృద్దాప్యంలో ఆనాటి గాయాలు ఇప్పటికీ ఆమెను తొలచివేస్తున్నాయని.. కాబట్టి ఆమెకు సరైన న్యాయం చేసి స్వాంతన చేకూర్చాలని పిటిషన్లో పేర్కొన్నారు. డిసెంబర్ 7న ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. జస్టిస్ ఎస్కే కౌల్ నేత్రుత్వంలోని బెంచ్ ఈ పిటిషన్ను విచారించనుంది.
కాగా, భారతదేశ చరిత్రలో జూన్ 25, 1975 నుంచి మార్చి 21, 1977 వరకు దాదాపు 21 నెలల పాటు ఎమర్జెన్సీ అమలైంది. ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి రోజులుగా ఈ కాలాన్ని పేర్కొంటారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో మిన్నంటుతున్న ఆందోళనలు... అంతర్గత కల్లోల పరిస్థితుల దృష్ట్యా ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఇందిరా రాజకీయ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పిదంగా ఎమర్జెన్సీ పీరియడ్ మిగిలిపోయింది.