సోనియాకు ధమ్కీ: ఎఐసిసికి కిరణ్ రెడ్డి డుమ్మా
హైదరాబాద్: ఈ నెల 17వ తేదీన ఢిల్లీలో జరిగే ఎఐసిసి సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా సీమాంధ్ర నేతలు డుమ్మా కొట్టే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ అభిమతానికి భిన్నంగా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ధమ్కీ ఇవ్వడానికే వారు సమావేశానికి గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. నేరుగా తిరుగుబాటు ప్రకటించకుండా శానససభా సమావేశాలు ఉన్నాయనే సాకుతో సమావేశానికి హాజరు కాకూడదని అనుకుంటున్నట్లు సమాచారం.
తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చిస్తున్న శానససభ తిరిగి ఈ నెల 17వ తేదీ నుంచి జరగనుంది. ఎఐసిసి సమావేశాలకు హాజరు కావడంలో అర్థం లేదని కిరణ్ కుమార్ రెడ్డి తన సహచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. 17వ తేదీన జరిగే ఒక రోజు సమావేశానికి హాజరు కాకూడదని ఆయన సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశాల్లోనే రాహుల్ గాంధీని కాంగ్రెసు ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
సీమాంధ్రకు చెందిన చాలా మంది పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ఎఐసిసి సమావేశానికి హాజరు కాకపోవచ్చునని అంటున్నారు. గాదె వెంకటరెడ్డి వంటి అతివాద సమైక్యవాదులు హాజరు కాకపోవడం అనేది గ్యారంటీ అంటున్నారు. ప్రతి శాసనసభా నియోజకవర్గం నుంచి ఇద్దరేసి ఎఐసిసి ప్రతినిధులుంటారు.
కాగా, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఎఐసిసి సమావేశానికి హాజరై, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అనధికారిక తీర్మానాన్ని ప్రతిపాదించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆయన ఇదివరకే తన తీర్మానాన్ని జనవరి 1వ తేదీన పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదికి అందించారు. తాను ఎఐసిసి సమావేశాలకు హాజరవుతానని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. మొత్తం మీద, రాష్ట్ర విభజన నిర్ణయం ఎఐసిసి సమావేశాలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి.