బీజేపీ టిక్కెట్పై పోటీకి సెహ్వాగ్ నో, ఎందుకంటే? న్యూఢిల్లీ రేసులో గంభీర్, మౌనిక?
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ టిక్కెట్ పైన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పోటీ చేస్తున్నాడనే ప్రచారం సాగింది. అయితే సెహ్వాగ్ పోటీ చేయడం లేదని పార్టీలోని ఆయన సన్నిహితులు చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో మరో మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ను పోటీ చేయించాలని బీజేపీ భావిస్తోందట. న్యూఢిల్లీ లోకసభ స్థానం నుంచి గంభీర్ను బరిలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
యూపీ సహా ఆ రాష్ట్రాల నష్టానికి బీజేపీ ఇలా చెక్: చక్రం తిప్పుతున్న తెలుగోడు!
పోటీకి నో చెప్పిన సెహ్వాగ్
రాజధాని ఢిల్లీలో మొత్తం 7 లోకసభ స్థానాలు ఉన్నాయి. మొత్తం స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి సెహ్వాగ్ను బరిలోకి దింపాలని భావించింది. ఈ మేరకు సెహ్వాగ్తో చర్చలు కూడా జరిపినట్లుగా తెలుస్తోంది. వెస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేయమని కోరగా, ఆయన సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల తాను పోటీ చేయడం లేదని చెప్పారట. వెస్ట్ ఢిల్లీ లోకసభ నియోజకవర్గం పరిధిలోని ఓ ప్రాంతానికి సెహ్వాగ్ సోదరి కౌన్సెలర్గా ఉన్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. అతని సోదరి కౌన్సెలర్గా ఉన్నారని గుర్తు చేస్తున్నారు.
న్యూఢిల్లీ నుంచి గౌతమ్ గంభీర్ పరిశీలన
అదే సమయంలో, తాము గౌతమ్ గంభీర్ పేరును కూడా పరిశీలిస్తున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు. డిఫెన్స్ కాలనీలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ను కలిశామని, గంభీర్ను బరిలోకి దింపే అంశంపై చర్చించామని, అందుకు అంగీకరిస్తే న్యూఢిల్లీ లోకసభ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. న్యూఢిల్లీ నుంచి గంభీర్తో పాటు మౌనికా అరోరా పేరును కూడా పరిశీలిస్తున్నారు.
అభ్యర్థుల ఖరారుపై దృష్టి
ఢిల్లీలో లోకసభ ఎన్నికలు ఆరో విడత మే 12వ తేదీన జరగనున్నాయి. దేశ రాజధానిలోని ఏడు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై అధిష్టానం సంప్రదింపులు జరుపుతోంది. ఒక్కో నియోజకవర్గానికి ఇధ్దరి పేర్లను పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. వెస్ట్ ఢిల్లీ నుంచి ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ ప్రవేశ్ వర్మ ఉన్నారు. నార్త్ వెస్ట్ ఢిల్లీకి నగర మేయర్ అనిత ఆర్య పేరును పరిశీలిస్తున్నారు. అనిత ఆర్యతో పాటు మోహన్ సింగ్ బిష్త్, మాజీ మేయర్ సత్య శర్మ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ఢిల్లీలోని ఆయా నియోజకవర్గాల నుంచి పలువురి పేర్లు పరిశీలిస్తున్నారు.