దావూద్ ఆస్తులను వెంటనే జప్తు చేయండి: సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ముంబైలోని ఆస్తులను వెంటనే జప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆస్తుల స్వాధీనంపై దావూద్ తల్లి అమినా బీ కస్కర్, సోదరి హసీనా పార్కర్(వీరిద్దరి కొంత కాలం క్రితం మరణించారు) వేసిన పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. ఆ ఆస్తులు దావూద్కు చెందినవేనని, వాటిని జప్తు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది.
ముంబైలోని నాగ్పడాలో దావూద్కు చెందిన కొన్ని ఆస్తులను ఆయన తల్లి, సోదరి తమ పేర్లపై బదలాయించుకున్నారు. వీరిద్దరి పేర్లపై ఏడు రెసిడెన్షియల్ ఆస్తులు(రెండు అమీనా పేరుపై, ఐదు హసీనా పేరుపై) ఉన్నాయి. ఈ క్రమంలో 1988లో సఫెమా(స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యేలేటర్స్ ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీస్) చట్టం కింద ఈ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
ఈ జప్తును సవాల్ చేస్తూ దావూద్ తల్లి, సోదరి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో 1998లో వీరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే, ఆస్తులకు సంబంధించిన పత్రాలను చూపించాలని అమీనా, హసీనాకు పలుసార్లు అవకాశాలిచ్చామని ప్రభుత్వం చెబుతోంది. వారి వద్ద ఎలాంటి పత్రాలు లేవని ప్రభుత్వం పేర్కొంది.
ఈ నేపథ్యంలో విచారణ పూర్తి చేసిన సర్వోన్నత న్యాయస్థానం హసీనా, అమీనా పిటిషన్లను కొట్టివేసింది. 1993 ముంబై వరుస పేలుళ్ల ఘటనలో కీలక సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీం చాలా ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటున్నాడు. ఆయన పాక్లోని కరాచీలో ఉంటున్నట్లు భారత్ పదే పదే చెబుతున్నప్పటికీ.. పాకిస్థాన్ మాత్రం దీన్ని అంగీకరించట్లేదు. అయితే, ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా దావూద్ పాకిస్థాన్లోనే ఉన్నాడనే చిరునామాతో సహా పేర్కొనడం గమనార్హం.