ఐఎంఎ జ్యువెల్సర్ రూ. వేల కోట్ట చీటింగ్ కేసు: మన్సూర్ ఖాన్ మూడో భార్య ఇంటిలో ఎస్ఐటీ సోదాలు !
బెంగళూరు: రూ. వేల కోట్ల ఐఎంఎ చీటింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ (ఎస్ఐటీ) అధికారులు ఆ సంస్థ యజమాని మన్సూర్ ఖాన్ మూడో భార్య ఇంటిలో సోదాలు చేసి అనేక కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని విచారణ ముమ్మరం చేశారు.
బెంగళూరు నగరంలోని శివాజీనగరలోని వెంకటప్ప రోడ్డులోని మన్సూర్ ఖాన్ మూడో భార్య తబసుమ్ ఇంటిలో సోదాలు చేసిన అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని ఆమెను ప్రశ్నించారు. మన్సూర్ ఖాన్ విదేశాలుకు పారిపోయిన విషయం తనకు తెలీదని తబసుమ్ అధికారులకు సమాచారం ఇచ్చారని తెలిసింది.
ఎస్ఐటీ అధికారి ఎస్. గిరీష్ ఆధర్యంలో జరిగిన సోదాల్లో తబసుమ్ ఇంటిలో రూ. 2.50 (నగదు), 2. 50 కేజీల బంగారు నగలు, పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మన్సూర్ ఖాన్ మరో భార్య తబసుమ్ ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు ముమ్మరం చేశారని సమాచారం.
ఐఎంఎ సంస్థ యజమాని మన్సూర్ ఖాన్ తమకు రూ. 45 లక్షలు మోసం చేశారని ఔషదాలు వ్యాపారం చేస్తున్న జయంత్ మెహతా ఎస్ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఔషదాల వ్యాపారి జయంత్ మెహతా ఫిర్యాదు మేరకు ఎస్ఐటీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఐఎంఎ గ్రూప్ కు చెందిన ఫ్రంట్ లైన్ ఫార్మసింగ్ కు 2018 జులై నుంచి జయంత్ మెహతా ఔషదాలు సరఫరా చేస్తున్నారు. ప్రతి నెల 7వ తేదీ నుంచి బిల్లులు ఇస్తున్నారు. అయితే 2019 ఏఫ్రిల్ నుంచి బిల్లులు చెల్లించలేదని జయంత్ మెహతా అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఐఎంఎ సంస్థ యజమాని మన్సూర్ ఖాన్ తో పాటు నవీద్ అహమ్మద్, నాసీర్ హుస్సున్, నిజావుద్దీన్ అనే ముగ్గురి మీద జయంత్ మెహతా ఫిర్యాదు చేశారని, విచారణ చేస్తున్నామని ఎస్ఐటీ అధికారులు తెలిపారు. ఐఎంఎ సంస్థ యజమాని మన్సూర్ ఖాన్ కు ఐదు మంది భార్యలు ఉన్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.