సినిమా చూపిస్తున్న శేఖర్ రెడ్డి: బెయిల్ కోసం పరుగో పరుగు !
చెన్నై: తమిళనాడులో ఇసుక క్వారీల వ్యాపారంలో చక్రం తిప్పిన శేఖర్ రెడ్డి ఇప్పుడు కష్టాలపాలైనాడు. ఇప్పుడు ఆయన అనుచరులకు అథికారులు చుక్కలు చూపించడానికి సిద్దం అయ్యారు. శేఖర్ రెడ్డికి ఎవరు సన్నిహితులు అని అధికారులు ఆరా తీస్తున్నారు.
తమిళనాడులో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తరువాత శేఖర్ రెడ్డి పరిస్థితి సీన్ రివర్స్ అయ్యింది. ఎలాగైనా బెయిల్ మీద బయటకు వచ్చిన శేఖర్ రెడ్డిని మళ్లీ అధికారులు అరెస్టు చెయ్యడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.
శేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులు, వ్యాపారులను అధికారులు విచారించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో ఆయనతో వ్యాపారం చేస్తున్న నాయకులు, వ్యాపారులు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.
శేఖర్ రెడ్డితో వ్యాపారం చేసిన రామచంద్రన్, రత్నం అనే ఇద్దరు వ్యాపారవేత్తలు, రాజకీయనేత్తలు ఇప్పుడు ముందస్తు జామీను కోసం మద్రాసు హై కోర్టును ఆశ్రయించారు. ఇక ముందు శేఖర్ రెడ్డితో వ్యాపారం చేసిన వారు ఎంత మంది బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తారో ఆదేవుడికే తెలియాలి.