రూ. 180 కోట్ల బ్లాక్ మనీ: పన్నీర్, శశికళకు సీబీఐ చిక్కులు !
చెన్నై: తమిళనాడులో ఇసుక క్వారీలు, ప్రభుత్వ కాంట్రాక్టు పనుల ముసుగులో అక్రమంగా డబ్బు సంపాదించి ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారుల చేతికి చిక్కిన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి అలియాస్ బాబు శేఖర్ రెడ్డి ఇప్పుడు అన్నాడీఎంకే కీలకనేతలకు తలనొప్పిగా తయారైనాడు.
శేఖర్ రెడ్డి ఇంటిలో దాదాపు 180 కోట్ల రూపాయల నగదు, రూ. 130 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు కేసు నమోదు చేశారు. శేఖర్ రెడ్డి మీద కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు ఇప్పటికే అతన్ని అరెస్టు చేశారు.
జయ ఆప్తుడు: బినామీ పేరుతో దుబాయ్ లో రూ. 1,700 కోట్ల హోటల్ !
శేఖర్ రెడ్డి అక్రమాస్తులు బయటపడిన వెంటనే టీటీడీ బోర్డు సభ్యత్వం నుంచి తొలగించారు. శేఖర్ రెడ్డి దగ్గర ఉన్న డైరీని స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.
సీబీఐ అధికారులు కేసు నమోదు చేసిన వెంటనే అన్నాడీఎంకే పార్టీలోని కీలకనేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. శేఖర్ రెడ్డి కారణంగా నెచ్చెలి శశికళకు చిక్కులు వచ్చిపడుతాయని అన్నాడీఎంకే నాయకులే చెపుతున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు శేఖర్ రెడ్డి సన్నిహితుడిగా ఉన్నారు. శేఖర్ రెడ్డి కేసులో శశికళతో పాటు సీఎం పన్నీర్ సెల్వంకు సమస్యలు వస్తాయని అన్నాడీఎంకేలోని కొందరు నేతలు అంటున్నారు.
జయలలితకు ఆ ఐఏఎస్ ను రోశయ్య పరిచయం చేశారంట!
సీఎం పన్నీర్ సెల్వం, శశికళకు శేఖర్ రెడ్డి బినామిగా ఉన్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే సీబీఐ కేసు దర్యాప్తు చేస్తుండటంతో స్థానిక పోలీసుల దగ్గర ఎలాంటి సమాచారం లేదు.
అందువలన అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ కీలక నేతలకు సైతం ఎలాంటి వివరాలు అందడం లేదని సమాచారం. మొత్తం మీద శేఖర్ రెడ్డి కారణంగా సీఎం పన్నీర్ సెల్వంతో పాటు శశికళ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.