షాకింగ్ రిపోర్ట్ : 2030 నాటికి సెక్స్ రేషియో అంచనాలివే... హీన స్థితికి యూపీ...
సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ల కారణంగా 2030 నాటికి భారత్లో ఆడపిల్లల జననాల సంఖ్య 6.8 మిలియన్ల మేర తగ్గనున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. ఇందులో అత్యంత హీనమైన సెక్స్ రేషియో ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఉంటుందని పేర్కొంది. 1970ల నుంచి భారతదేశ లింగ నిష్పత్తిలో (SRB) అసమతుల్యత ఉన్నట్లు గుర్తించింది. లింగ నిర్దారణ పరీక్షలు, కుటుంబాల్లో మగ శిశువులకు ప్రాధాన్యత వంటి కారణాలతో ఈ పరిస్థితి తలెత్తినట్లు వెల్లడించింది. సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (KAUST),ఫ్రాన్స్లోని యూనివర్సిటీ డి పారిస్ పరిశోధకులు ఈ సర్వే చేపట్టారు.
Recommended Video
2011 నాటికి దేశంలోని 29 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 98.4శాతం జనాభాను పరిగణలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించారు. దేశంలో అత్యధిక జననాల రేటు ఉన్న 21 రాష్ట్రాల్లో... 17 రాష్ట్రాల్లోని లింగ నిష్పత్తిలో 'కొడుకు ప్రాధాన్యత' అంశం స్పష్టంగా కనిపిస్తోందని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా 9 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లోని లింగ నిష్పత్తి గణాంకాలపై 'కొడుకు ప్రాధాన్యత' ప్రభావం ఉందన్నారు. 2017 నుంచి 2030 వరకు ఉత్తరప్రదేశ్లో 2 మిలియన్ల ఆడ శిశువుల జననాలు ఆగిపోయే అవకాశం ఉందని... దేశంలోనే ఆడ శిశువుల జననాల రేటులో యూపీ అత్యంత హీన స్థానంలో ఉంటుందని పేర్కొన్నారు.
మొత్తంగా భారత్లో 2017 నుంచి 2030 మధ్యలో ఆడపిల్లల జననాల సంఖ్య 6.8 మిలియన్ల మేర తగ్గనున్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. 2017 నుంచి 2025 వరకు ప్రతీ ఏటా సగటున ఆడపిల్లల జననాల సంఖ్య 4,69,000 మేర తగ్గుతుందని... ఆ తర్వాత ఇది మరింత పెరిగి 2026 నుంచి 2030 వరకు 519000 మేర ఆడ పిల్లల జననాల సంఖ్య తగ్గుతుందని అంచనా వేశారు.
భారతదేశంలో లింగ నిర్దారణ పరీక్షలను 1994లోనే నిషేధించినప్పటికీ.. ఇప్పటికీ ఆడ శిశువుల అబార్షన్లు భారీగానే జరుగుతున్నాయి. దానికి తోడు మగబిడ్డను కనేందుకే ఎక్కువమంది దంపతులు ఆసక్తి కనబరుస్తుండటం... మగ పిల్లాడిని కంటే తమ ప్రతిష్ట పెరుగుతుందని భావిస్తుండటం ఆడపిల్లల పట్ల వివక్షకు కారణమవుతోంది. అశాస్త్రీయమైన,అమూర్త భావనలతో ఆడ-మగ మధ్య కొనసాగుతున్న ఈ వివక్షకు తెరపడితే తప్ప భారత్లో స్త్రీ-పురుష సమానత్వం సాధ్యపడదు.