మోడీ ఘాటుగా..: మనం ఫ్రెండ్స్ అంటూ జింపింగ్ ఆసక్తికరం
పనాజీ: బ్రిక్స్ సమావేశాల వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదంపై తీవ్రంగా స్పందించారు. బ్రిక్స్ దేశాలు ఉగ్రవాదాన్ని సహించకూడదని స్పష్టం చేశారు. ఉగ్రవాద గ్రూప్లు, ఉగ్రవాదుల విషయంలో ఉద్దేశపూరిత సంకుచిత వైఖరి ఎంతమాత్రం ప్రయోజనకరం కాదని, భవిష్యత్తులో ఇది తమకే ప్రమాదం కాగలదని ఆయన.. చైనా సహా ఇతర బ్రిక్ దేశాలను హెచ్చరించారు.
పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా ఆ దేశం ఉగ్రవాదం విషయంలో అవలంబిస్తున్న ద్వంద్వ విధానాల్ని ప్రధాని మోడీ ఏకిపారేశారు. ఉగ్రవాదానికి మాతృత్వ దేశంగా పాకిస్థాన్ మారిపోయిందని ఆయన తేల్చి చెప్పారు. ఆదివారం జరిగిన బ్రిక్స్ ప్లీనరీ సదస్సులో మాట్లాడిన ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
'ప్రస్తుతం మనం నివసిస్తున్న ప్రపంచంలో భద్రత, ఉగ్రవాద నిరోధం అత్యవసరంగా మారిపోయాయి. మన ప్రగతి, పురోగతి, సౌభాగ్యాలపై ఉగ్రవాదం పడగనీడ పరుచుకుంది' అని అన్నారు. అంతేగాక, 'మన ఆర్థిక సుసంపన్నతకు ఉగ్రవాదం ఉగ్రవాదం పెనుముప్పుగా మారింది. విషాదకరంగా దీని మాతృత్వం పొరుగుదేశంలో ఉంది. ఆ దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాదు.. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదం సమంజసమైనదేనని దృక్పథాన్ని ఆ దేశం గట్టిగా చాటుతోంది' అని అన్నారు.
'ఉగ్రవాదులకు అందుతున్న నిధులు, ఆయుధాలు, శిక్షణ, రాజకీయ మద్దతును వ్యవస్థాగతంగా దూరం చేయాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మన జాతీయ భద్రతా సలహాదారుల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవాలి. అంతర్జాతీయ ఉగ్రవాదంపై తొందరగా ఒక సమగ్ర తీర్మానాన్ని చేయాలి. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు దృఢమైన నిశ్చయాన్ని ప్రకటించాలి' అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
జింపింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
పాకిస్థాన్ విషయంలో భారత్-చైనా మధ్య సంబంధాలు కుంటుపడుతున్న నేపథ్యంలో బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మనదేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లో తాను భారత్ను సందర్శించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు జింపింగ్.
'2014లో నేను భారత్ వచ్చాను. ఈ గొప్ప దేశానికి చెందిన కష్టపడే ప్రజలు, రంగురంగుల సంస్కృతి నన్ను చాలా ముగ్ధున్ని చేశాయి' అని తెలిపారు. బ్రిక్స్ సహకారం ప్రారంభమై ఈ ఏడాదితో పదేళ్లు పూర్తవుతోందని, ఈ నేపథ్యంలో అక్టోబర్ నెల బ్రిక్స్ దేశాలకు ఫలప్రదంగా మారాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
'మనం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. బ్రిక్స్ దేశాలమైన మనం మంచి స్నేహితులుగా, సోదరులుగా, భాగస్వాములుగా ఉండి ఒకరినొకరు నిజాయితీగా గౌరవించుకోవాలి' అని జిన్పింగ్ సూచించారు.
కాగా, భారత్.. కీలకంగా భావిస్తున్న ఉగ్రవాదంపై పోరులో ఐక్యత, అణు సరఫరాదారుల గ్రూప్ (ఎన్ఎస్జీ)లో భారత్ స్వభ్యత్వానికి మద్దతు అంశాలపై చైనా తన అధికారిక ప్రకటనలో ప్రస్తావించకపోవడం గమనార్హం. పాక్ ఉగ్రవాది మసూద్ అజార్పై ఐరాస ఆంక్షల విషయంలోనూ మరింత సంప్రదింపులు జరిపి సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరుదేశాలు భావిస్తున్నట్టు చైనా తెలిపింది.