నిత్యానందకు కొత్త చిక్కులు... పాస్పోర్టు రద్దు చేసిన విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ: దేశం విడిచి పారిపోయిన నిత్యానంద స్వామి పాస్పోర్టును విదేశాంగ మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. తాజా పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకోగా దాన్ని కూడా తిరస్కరించింది. నిత్యానంద పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నందను తనకు కొత్త పాస్పోర్టు జారీ చేయలేమని చెప్పారు. అదే సమయంలో ఉన్న పాస్పోర్టును కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ మధ్యే నిత్యానంద ఓ వీడియోను విడుదల చేశాడు. తన సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు అందులో పేర్కొన్నాడు. హైందవ సిద్దాంతాలను అనుసరిస్తూ ఆ దేశం నిర్మించుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
అయితే కైలాస అని చెబుతున్న దేశం ఎక్కడ ఉందో దాని లొకేషన్ కరెక్టుగా తెలియనప్పటికీ ధనవంతులైన నిత్యానంద శిష్యులు ఆ దీవిని కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. ఇది ఈక్వేడర్కు దగ్గరలో ఉన్నట్లు కథనం ప్రచురించింది. అయితే స్వామీజీగా పిలవబడుతున్న నిత్యానందకు ఎలాంటి ఆశ్రయం కల్పించలేదని ఈక్వెడార్ ప్రభుత్వం వివరించింది. అతని పేరిట భూమి కొనుగోలు జరిగినట్లు కూడా ఎలాంటి ఆధారాలు లేవని ఈక్వెడార్ ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు అత్యాచారం కిడ్నాప్లాంటి పలుకేసుల్లో పోలీసులు నిత్యానంద కోసం వెతుకుతున్నారు.
తనపై అత్యాచారం, కిడ్నాప్ కేసులు కర్నాటకలో నమోదైనందున తనవద్ద ఉన్న పాస్పోర్టుతో దేశం వీడి పారిపోయాడు. అతని అసలు పేరు రాజశేఖరన్. తమిళనాడు నిత్యానంద సొంత రాష్ట్రం. 2000వ సంవత్సరంలో బెంగళూరులో ఒక ఆశ్రమం తెరిచారు. ఓషో రజనీష్ ప్రవచనాల ఆధారంగా నిత్యానంద బోధనలు ఉంటాయని తెలుస్తోంది. 2010లో నిత్యానంద స్వామి నటి రంజితతో పడకగదిలో కలిసి ఉన్న ఒక వీడియో ఆన్లైన్లో దర్శనమివ్వడంతో ఆయన భాగోతాలు ఆ తర్వాత చాలా వెలుగు చూశాయి. ఆ తర్వాత అత్యాచార ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేయడం జరిగింది. 400,000డాలర్ల కుంభకోణంలో ఫ్రెంచ్ విచారణ సంస్థలు కూడా నిత్యానందను విచారణ చేసినట్లు సమాచారం.
గతనెలలో అహ్మదాబాదులోని తన ఆశ్రమం నుంచి ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం కావడంతో నిత్యానందపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. పిల్లలను కిడ్నాప్ చేయడం వారితో చేయరాని పనులు చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఆశ్రమం కోసం విరాళాలు సేకరించాల్సిందిగా ఒత్తిళ్లకు గురిచేసేవాడని పోలీసులు చెప్పారు.