బిగ్ బాస్ కంటెస్టెంట్ స్వామి ఓం అరెస్టు, 9 ఏళ్ల తరువాత చోరీ కేసు విచారణ !
హిందీ బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్, వివాదాస్పద స్వామిజీ స్వామి ఓం అలియాస్ వినోధానంద జాను చోరీ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.
న్యూఢిల్లీ: హిందీ బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్, వివాదాస్పద స్వామిజీ స్వామి ఓం అలియాస్ వినోధానంద జాను చోరీ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. విలువైన ఇంటి పత్రాలు, 11 సైకిళ్లు, విలువైన వస్తులు చోరీ చేసిన కేసులో స్వామి ఓం అరెస్టు అయ్యారు.
తన షాప్ లో 11 సైకిళ్లు, విలువైన విడిభాగాలు, ఇంటి సేల్ డీడ్ పత్రాలు, విలువైన డాక్యూమెంట్లు చోరీ అయ్యాయని స్వామి ఓం సోదరుడు ప్రమోద్ జా 2008 నవంబర్ లో ఢిల్లీలోని లోధి కాలనీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన సోదరుడు వినోధానంద జా అలియాస్ స్వామి ఓం చోరీ చేశాడని ప్రమోద్ జా ఆరోపించారు.
కేసు విచారణ చేసిన పోలీసులు స్వామి ఓం మీద కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. 2008 నవంబర్ నెల నుంచి కేసు విచారణ జరుగుతోంది. ఢిల్లీలోని సాకేట్ కోర్టులో కేసు విచారణ జరిగింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే హిందీ బిగ్ బాస్ సీజన్ 10లో స్వామి ఓం ఎంట్రీ ఇచ్చాడు.
హిందీ బిగ్ బాస్ సీజన్ 10లో కంటెస్టెంట్ అయిన స్వామి ఓం రియాలిటీ షో నడిపిస్తున్న సల్మాన్ ఖాన్ మీద తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ ఖాన్ కు పెళ్లి అయ్యిందని, ఓ కుమార్తె ఉందని అన్నాడు. అంతే కాకుండా సల్మాన్ ఖాన్ కు ఎయిడ్స్ ఉందని, అందుకే పెళ్లి చేసుకోలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో దూమరం రేగింది.
బిగ్ బాస్ సీజన్ 10 షోలో ఉన్న సమయంలో రెండు సార్లు కోర్టు విచారణకు హాజరై మళ్లీ బిగ్ బాస్ షోకు వెళ్లాడు. ఢిల్లీలోకి సాకేట్ కోర్టు వినోధానంద జా అలియాస్ స్వామి ఓం నేరం చేశాడని తీర్పు చెప్పింది. ఢిల్లీ క్రైంబ్రాంచ్, భజనాపుర, లోధి కాలనీ పోలీసులు మూడు టీంలుగా గాలించి స్వామి ఓంను అరెస్టు చేసి జైలుకు పంపించారు.