6 లక్షలకు బాలికను కొనుక్కున్నాడు..! మోజు తీరాక..
ముంబై : పసితనం ఛాయలు కూడా తొలగిపోని చిన్నారులను సైతం దేశంలో వ్యభిచార వృత్తిలోకి లాగుతోన్న పరిస్థితి. ఆలనా పాలనా కరువైన ఎంతోమంది చిన్నారులు దేశంలోని వ్యభిచార గృహాల్లో ధీనంగా బ్రతుకీడుస్తున్నారు. 14 ఏళ్లు కూడా నిండకుండానే అత్యాచారాలకు బలైపోయి.. రేటు లెక్కన ఒకరి నుంచి మరొకరికి చేతుల్లోకి మారిపోతూ..! నిజంగానే అమ్మాయిల పరిస్థితి ఇప్పుడు అంగట్లో సరుకులా తయారైంది.
తాజాగా ఓ 14 ఏళ్ల బాలిక తన దయనీయ పరిస్థితిపై పోలీసులను సంప్రదించడంతో.. దేశంలో మైనర్ బాలికల అమ్మకాలు ఎంత యథేచ్చగా జరిగిపోతున్నాయో బయటపడింది. ముంబైలోని తులింజీ పోలీస్ స్టేషన్ లో ఆ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు దిమ్మ తిరిగే వాస్తవాలు తెలిశాయి.
తల్లితండ్రులు మరణించడంతో.. ఆ బాలిక తన సవతి తల్లి అయిన శాంతి వద్ద ఉంటూ వస్తోన్న క్రమంలో.. క్రిపారం చౌదరి అనే కామాంధుడికి బాలికను విక్రయించింది శాంతి. అంతకుముందు మరో ఇద్దరు మైనర్ బాలికలను కూడా రూ.50 వేలు, రూ.5 లక్షలకు శాంతి విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే బాలిక మైనర్ కావడంతో.. 20 ఏళ్ల వయసున్నట్లుగా తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించిన శాంతి వివాహం ముసుగులో రూ.6లక్షలకు బాలికను క్రిపారం చౌదరికి అమ్మేసింది.
ఇలా పెళ్లి పేరిట రాజస్తాన్ లో ఎంతోమంది మైనర్ బాలికలను వ్యభిచార గృహాలకు తరలిస్తున్నట్లుగా పోలీసులు నిర్దారించారు. ఇక బాలిక విషయానికొస్తే.. ఆమెను సవతి తల్లి శాంతి నుంచి కొనుగోలు చేసిన అనంతరం ముంబై తీసుకుని వెళ్లిపోయాడు.10 నెలలుగా గదిలో నిర్బంధించి తన శారీరక పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్నాడు క్రిపారం చౌదరి. ఇదే క్రమంలో బాలికపై తనకు మోజు తీరగానే మరో వ్యక్తికి రూ.15 లక్షలకు విక్రయించడానికి సిద్దపడ్డాడు.
రాజస్తాన్ లో బాలికల విక్రయాలు మామూలే : నిందితుడు
అయితే ఎలాగోలా క్రిపారం చౌదరి చెర నుంచి బయటపడ్డ బాలిక, పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. అనంతరం దీనిపై విచారణ చేపట్టగా రాజస్తాన్ లో ఎంతోమంది బాలికలను యథేచ్చగా విక్రయిస్తున్నట్లు వెల్లడయింది. నిందితుడు క్రిపారం చౌదరి కూడా.. రాజస్థాన్ లో బాలికల విక్రయం మామూలేనని పోలీసులతో వెల్లడించడం గమనార్హం.
మైనర్ బాలికను కొనడం, నిర్బంధించడం, అత్యాచారానికి పాల్పడ్డం, వ్యభిచార కూపాలకు తరలించే చేయడం అనే అభియోగాల కింద ఐపీసీ సెక్షన్ 376, 366 ఏ, 372, 373, 34, పిల్లల రక్షణ, లైంగిక నేరాల నిరోధక చట్టాల కింద చౌదరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.