చిత్రకళ ప్రదర్శనలో హాఫ్ న్యూడ్ చిత్రాలపై రచ్చ..
అర్దనగ్న చిత్రాలను ప్రదర్శిస్తున్నారన్న కారణంగా.. ఓ చిత్రకళ ప్రదర్శనపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
జైపూర్: ఓ చిత్రకళ ప్రదర్శనపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి నానా రచ్చ చేశారు. కొన్ని పెయింటింగ్స్ ను ఎత్తుకెళ్లడంతో పాటు మరికొన్నింటిని కిందపడేసి ధ్వంసం చేశారు. గురువారం నాడు జైపూర్ లో ఏర్పాటు చేసిన ఓ చిత్రకళ ప్రదర్శనలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అర్దనగ్న చిత్రాలను ప్రదర్శిస్తున్నారన్న కారణంగా.. కొంతమంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఓ కళాకారుడిపై చేయి కూడా చేసుకున్నారు. అర్దనగ్న చిత్రాల ప్రదర్శన సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తుల్లో ఓ మహిళ కూడా ఉంది.
అర్దనగ్న చిత్రాలు వేసిన పెయింటర్ కు ఆమె వార్నింగ్ ఇస్తుండగా.. ఆమె వెనకాల ఉన్న మరో వ్యక్తి వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. ఈ తతంగమంతా సీసీటీవి ఫుటేజీలో రికార్డయినట్టుగా తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నా.. ఆలోపే వారు అక్కడినుంచి పరారయ్యారు. ఘటనకు బాధ్యులైన వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు.