థెరీసాపై వివాదం: 'ఆరెఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిజమే చెప్పారు'
న్యూఢిల్లీ: మదర్ థెరీసాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు శివసేన మద్దతుగా నిలిచింది. ఆయన కొంత నిజమే చెప్పారని ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొంది. విదేశాల నుంచి మిషనరీలుగా వస్తున్న క్రైస్తవ సంస్థలు మన దేశంలో చాలామందిని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నాయని ఆ పత్రికలో పేర్కొంది.
ముస్లింలు కత్తితో బెదిరించి మత మార్పిడి చేస్తే, క్రైస్తవులు డబ్బు, సేవల పేరిట మతమార్పిడిలకు పాల్పడుతున్నారని ఆ శివసేన పేర్కొంది. అయితే, మనమంతా మదర్ థెరిసా సేవలను గుర్తించామని, ఆమెలాగే చాలామంది కూడా సేవలందించారని, కానీ ఎలాంటి మత మార్పిడిలకు దిగలేదని సామ్నాలో పేర్కొంది.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాజస్ధాన్లోని భరత్ పూర్లో జరిగిన ఎన్జీఓ కార్యక్రమంలో నిరుపేదలకు మదర్ థెరిస్సా సేవ అందించడం వెనుకున్న ప్రధాన లక్ష్యం క్రైస్తవ మత మార్పిడేనని అన్నారు. మదర్ థెరిస్సా సేవలు మంచిదే. కానీ వ్యక్తులను క్రైస్తవ మతంలోకి మార్పిడి చేయడానికి సేవను ఆధారంగా చేసుకున్నారని అన్నారు.
దేశంలోని పేదలను సేవల ద్వారా మత మార్పిడికి పాల్పడటం వల్ల ఆమె అందించిన సేవకు విలువ లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. మదర్ థెరిస్సా సేవలపై మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబధ్దం అంటూ కాంగ్రెస్ కొట్టి పారేసింది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ మదర్ థెరిస్సా సేవలు ప్రపంచానికే ఆదర్శప్రాయమని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ మదర్ థెరిస్సా చాలా గొప్ప వ్యక్తి, ఆమెపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు.
మదర్ థెరీసాను వివాదాల్లోకి లాగొద్దని, ఇక ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా వదిలేయాలని కోరారు. తాను కోల్కతాలోని నిర్మల్ హృదయ్ ఆశ్రమంలో థెరీసాతో కలిసి కొంతకాలం పనిచేసినట్లు కేజ్రీవాల్ చెప్పారు.