ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సుప్రీంకోర్టుకు సమర్పించనున్న శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ
మహారాష్ట్రలో మెజార్టీ లేని దేవేంద్ర ఫడ్నవీస్ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ భగత్ సింగ్ కొషియారి ఆహ్వానించడంతో.. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఎన్వీరమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఫడ్నవీస్ మద్దతు లేఖను సమర్పించాలని అటార్నీ జనలర్ను ఆదేశించింది. దీంతో బీజేపీ తమ మద్దతుపై మల్లగుల్లాలు పడుతుంటే.. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ తమ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. దీంతో మహారాష్ట్రలో బలబలాల అంశం ఉత్కంఠకు చేరింది.
ఇవీ నిన్నటి వాదనలు..
మహారాష్ట్రలో మెజార్టీ ప్రభుత్వ లేకున్నా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని శివసేన తరపు లాయర్ కపిల్ సిబాల్ ఆదివారం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు అక్టోబర్ 24న పూర్తయ్యాయని తెలిపారు. శివసేన-బీజేపీ పొత్తు పొడవకపోవడంతో.. శివసేన కూటమి తెరపైకి వచ్చిందన్నారు. కానీ తగిన సమయం ఇవ్వకుండానే రాష్ట్రపతి పాలన విధించారని తెలిపారు. నవంబర్ 23వ తేదీ తెల్లవారుజామున దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని గుర్తుచేశారు. మెజార్టీ లేకుండానే ప్రభుత్వాన్ని గవర్నర్ భగత్ సింగ్ కొషియారి ఆహ్వానించారని తెలిపారు. అలాగే శనివారం ఉదయం 5 గంటలకు రాష్ట్రపతి పాలన తొలగించారని పేర్కొన్నారు. గవర్నర్ ఎవరి ఆదేశాలతో పనిచేస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో వెంటనే బలనిరూపణకు ఆదేశాలు జారీచేయాలని కోరారు.
లైవ్ టెలికాస్ట్
కాంగ్రెస్ అడ్వకేట్ అభిషేక్ మను సింగ్వి కూడా మహారాష్ట్రలో 24 గంటల్లో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ధర్మసనాన్ని ఆదివారం కోరారు. దీంతోపాటు కర్ణాటక, ఉత్తరాఖండ్ మాదిరిగా లైవ్ టెలికాస్ట్లో బలనిరూపణ చేయాలని ధర్మసనానికి విన్నవించారు. అలాగే డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలన్నారు. మహారాష్ట్రలో సీఎం, డిప్యూటీ సీఎం ఎలా పదవీ చేపట్టారని సింగ్వి సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.
17 రోజుల్లో ఏం చేశారు..
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ తరఫున ముకుల్ రోహత్గి కూడా ధీటుగా వాదనలు వినిపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి శివసేన కూటమికి గవర్నర్ నోటీసు ఇచ్చారని తెలిపారు. దాదాపు 17 రోజుల సమయం కూడా ఇచ్చారని చెప్పారు. శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతోనే గవర్నర్ విచక్షణాధికారం ఉపయోగించారని తెలిపారు. దీనిని న్యాయ సమీక్ష చేసే అధికారం సుప్రీంకోర్టుకు లేదని పేర్కొన్నారు.
ఆర్టికల్ 361 ప్రకారం
ప్రభుత్వాన్ని బలనిరూపణ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందన్నారు. కానీ ప్రజలకు ప్రభుత్వం కావాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం తప్పేమీ కాదు కదా అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు శనివారం నాటి గవర్నర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదన్నారు. ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్, రాష్ట్రపతిని ప్రశ్నించే అధికారం లేదని గుర్తుచేశారు.