మహా పొత్తు: శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ మధ్య కుదిరిన పొత్తు, కామన్ ఎజెండా ఇదే..
మహారాష్ట్రలో కొత్త పొత్తు పొడవనుంది. వైరి పక్షాలు ఐక్యతారాగం వినిపించబోతున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన చెట్టాపట్టాలేసుకోబోతుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కామన్ మినిమం ప్రోగ్రామ్పై మూడు పార్టీల ప్రతినిధులు చర్చించారు. 48 గంటలపాటు చర్చించి నాలుగు పేజీల డ్రాప్ట్ను రూపొందించారు. దీనిని తమ అధినేతలకు పంపిస్తామని పార్టీ ప్రతినిధులు తెలిపారు.
ఇదే ఎజెండా..
ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కామన్ మినిమం ప్రోగ్రామ్పై స్పష్టత వచ్చింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించి నాలుగు పేజీల నివేదికను రూపొందించారు. ఇందులో రైతు రుణమాఫీ గురించి చర్చించారు. తాము అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రస్తావించింది.
పంట బీమా పథకం కూడా
దీంతోపాటు పంట బీమా పథకాన్ని సమీక్షిస్తామని కూడా తెలిపింది. మహారాష్ట్రలో వర్షాభావ పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. దీంతోపాటు పంటకు కనీస మద్దతు ధఱపై కూడా హామీనిచ్చారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పన, ఛత్రపతి శివాజీ మహారాజ్, బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ స్మారక చిహ్నాల ఏర్పాటు గురించి తమ అజెండాలో చేర్చారు.
ప్రతినిధుల ఆమోదం
నాలుగు పేజీల డ్రాప్ట్కు మూడు పార్టీ ప్రతినిధులు ఆమోదం తెలిపారు. దానిని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరేకుప పంపించారు. వారు ఆమోదం తెలిపాక.. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందులో మార్పులు ఉంటే చేస్తారు. లేందటే ముగ్గురు నేతలు కలిసి మీడియాతో తమ అజెండా గురించి చర్చించి.. ప్రభుత్వ ఏర్పాటు గురించి వివరిస్తారని కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ తెలిపారు.
అధినేతల ఆమోదంతో..
డ్రాప్ట్ను అధినేతలకు పంపించామని, వారి ఆమోదంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభవుతుందని శివసేన నేత ఏక్ నాథ్ షిండే తెలిపారు. రెండు, మూడురోజుల ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. పార్టీ అధినేతల ఆమోదం తర్వాత గవర్నర్ వద్దకెళ్లి ప్రభుత్వ ఏర్పాటు గురించి చెబుతామని తెలిపారు. గవర్నర్ ఆమోదంతో సుస్థిర ప్రభుత్వం నెలకొల్పుతామని వెల్లడించారు.