సేన ప్రభుత్వానికి రంగం సిద్ధం.. బయట మద్దతుకు సోనియా ఓకే.. పదవుల పంపకంపైనే పీటముడి
మహారాష్ట్రలో రాజకీయాలు రంజుగా మారాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేన పార్టీ ఎన్సీపీతో కలిపి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీంతో ఒక్కసారిగా ముంబైలో రాజకీయ వాతావరణం మారుతోంది. ఇక ఎటొచ్చి కాంగ్రెస్ కూడా శివసేనకు మద్దతు తెలపడంతో మహా రాజకీయాలు ఒక్కింత ఆసక్తిని రేకెత్తిస్నున్నాయి.
అనాలిసిస్: మహారాష్ట్రలో హైడ్రామా.. గవర్నర్ ఏం చేయబోతున్నారు..?
మహా పాలిటిక్స్ ముంబై టూ ఢిల్లీ
మహారాష్ట్ర రాజకీయాలు ఇటు ఉత్కంఠతో పాటు అటు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని బీజేపీ గవర్నర్కు చెప్పడంతో ఇక శివసేనను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ కోరడం తక్కువ సమయం ఉండటంతో వేగంగా పావులు కదిపింది. ఇక ముంబై నుంచి ఢిల్లీకి మహారాష్ట్ర రాజకీయం మారింది. ఈ క్రమంలోనే ఎన్డీయేతో తెగదెంపులు చేసుకోవడం, ఆ తర్వతా ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చర్చలు ప్రారంభించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. మరోవైపు కాంగ్రెస్ కూడా శివసేనకు మద్దతు ఇస్తామని ప్రకటించడంతో ఇక ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
శివసేనతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం
ఇక శరద్ పవార్ తన పార్టీ సీనియర్లతో భేటీ అయ్యాక శివసేనకు మద్దతు ఇచ్చే విషయమై తొందరపాటు నిర్ణయం తీసుకోమని చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరో ఎన్సీపీ నేత మాత్రం శివసేనతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇక కాంగ్రెస్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో శివసేన - ఎన్సీపీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు వేగంగా కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే శరద్పవార్తో సమావేశం అయ్యారు.
సంకేతాలు శివసేనకు పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చిన కాంగ్రెస్
మహారాష్ట్ర రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తోన్న కాంగ్రెస్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి మహారాష్ట్రకు చెందిన పార్టీ సీనియర్ నేతలు రావాల్సిందిగా ఆదేశించింది. ఈ సమావేశంలో శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు మహారాష్ట్రలోని మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని ఆ రాష్ట్ర ఇంఛార్జ్ సీనియర్ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే వివరించారు. మొత్తం 44 మందిలో 37 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శివసేనకు సపోర్ట్ ఇస్తామని చెప్పినట్లు ఖర్గే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కాంగ్రెస్ శివసేనకు మద్దతుపై పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చినప్పటికీ తుది నిర్ణయం మాత్రం సాయంత్రం 4 గంటల తర్వాత వెల్లడిస్తామని స్పష్టం చేసింది.
పదవుల పంపకాలపై చర్చ
ఇక శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే శరద్ పవార్తో భేటీ అయ్యారు. రెండు పార్టీలు కలిపి కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పదవులపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. బీజేపీకి శివసేన ఎలాంటి కండీషన్స్ అయితే పెట్టిందో అలాంటి కండీషన్స్ ఎన్సీపీ విధించే అవకాశం ఉంది. సీఎం అభ్యర్థిగా ఉద్ధవ్ థాక్రే పేరు వినిపిస్తోంది. ఒక వేళ శివసేన సీఎం పదవి చేపడితే స్పీకర్, ఉపముఖ్యమంత్రి పదవితో పాటు ఆరు ప్రాధాన్యత కలిగి ఉన్న పోర్టు ఫోలియోలను శరద్ పవార్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఉద్ధవ్ థాక్రే సీఎం అయితే ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా శరద్ పవార్ అల్లుడు అజిత్ పవార్ బాధ్యతలు చేపట్టే ఛాన్సెస్ ఉన్నాయి.
మొత్తానికి శరద్పవార్తో భేటీ అనంతరం శివసేన మధ్యాహ్నం 2:30 గంటలకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యావర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుపై నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. శివసేనకు ఇచ్చిన గడువు సోమవారం సాయంత్రం 7:30 గంటలకు ముగియనుంది.