ఈ లక్ష్మిని పార్లమెంటుకు పంపండి: హేమామాలిని
మథుర: సిరిసంపదల దేవత ‘లక్ష్మి' సైకిల్(సమాజ్వాది పార్టీ గుర్తు)పై రాదనీ, ఏనుగు(బహుజన సమాజ్వాది పార్టీ గుర్తు)పై కూడా రాదనీ.. ఆమె కమలం పువ్వులోనే వస్తారని భారతీయ జనతా పార్టీ మథుర పార్లమెంటు అభ్యర్థి హేమమాలిని అన్నారు. అందుకే ఈ లక్ష్మి(తనను)ని పార్లమెంటుకు పంపాలని హేమామాలిని ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా హేమామాలిని మథుర పార్లమెంటు నియోజకవర్గంలోని రాంలీలా మైదానంలో పర్యటించారు. ఆమెను చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. పలువురు ఆమెను తమ సెల్ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను మథుర బయటి నుంచి వచ్చిన వ్యక్తిని కాదని అన్నారు. బ్రజ్ భూమి(మథుర)తో తనకు సుదీర్ఘమైన అనుబంధం ఉందని తెలిపారు.
తాను ఎప్పటి నుంచో మథురలో ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లు హేమామాలిని తెలిపారు. అది ఇప్పుడు సాకారమవుతోందని అన్నారు. ఎన్నికల తర్వాత తనపై ఆరోపణలు చేస్తున్న వారికి సమాధానం చెబుతానని తెలిపారు. తాను ముంబైలోనే ఎక్కువగా ఉంటానని, అరుదుగా ఇక్కడికి వస్తానని వస్తున్న ఆరోపణలు ఆమె ఖండించారు.
కాగా, కాంగ్రెస్ అభ్యర్థిగా మథుర నుంచి పోటీ చేస్తున్న మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కుమారుడు జయంత్ చౌదరి కూడా ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేశారు. తనకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు హేమామాలినిని అందరూ తెరపైనే చూశారని, ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలు ఆమెను ప్రత్యక్షంగా చూస్తున్నారని అన్నారు.