హైడ్రామా: శశికళ ముందు నిలబడి వేడుకోలు, కుట్రలు తిప్పికొడతామని పన్నీరు సెల్వం
అన్నాడీఎంకేను మీరు తప్ప ఇక ఎవరూ నడపలేరని, పార్టీ పగ్గాలు స్వీకరించాలని అన్నాడీఎంకేలోని సీనియర్ నాయకులు కొందరు శశికళకు విజ్ఞప్తులు చేస్తున్నారు.
చెన్నై: అన్నాడీఎంకేను మీరు తప్ప ఇక ఎవరూ నడపలేరని, పార్టీ పగ్గాలు స్వీకరించాలని అన్నాడీఎంకేలోని సీనియర్ నాయకులు కొందరు శశికళకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా మీరే నడపగలని చెప్పారు.
జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేలో పరిణామాలు మారుతున్న విషయం తెలిసిందే. జయ పార్టీని ఎలా నడిపేవారో, ఆమె వ్యూహ ప్రతివ్యూహాలు ఏమిటో మీకు మాత్రమే తెలుసునని, అందువల్ల మీరే పార్టీ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టాలని అన్నాడీఎంకేకు చెందిన సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు శశికళను వేడుకున్నారట.
షాకింగ్: 'అయ్యో ఇన్ని రోజులా..' జయలలిత ఫోటోకు శశికళ నో!
శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు పోయెస్ గార్డెన్ల ో హైడ్రామా చోటు చేసుకుంది. అన్నాడీఎంకే నేతలంతా శశికళ ముందు వరుస కట్టారు. ఆమె ముందు నిలబడి ఇక తమను పాలించమని వేడుకున్నారు.
మరోవైపు, ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శనివారం రాత్రి ఆమెతో భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. శశికళతోనే పార్టీకి భవిష్యత్తు అని, ముప్పై మూడు ఏళ్లుగా జయలలిత వెన్నంట ఉండి, పార్టీ కోసం కృషి చేశారని, సైనిక క్రమశిక్షణతో కూడిన ఆమె తీరు పార్టీ నేతలను ముందుండి నడిపిస్తుందని, ఆమెకు అండగా ఉందామని పార్టీని విచ్ఛిన్నం చేయాలనుకునే వారి కుట్రలను తిప్పికొడతామని అన్నా డీఎంకే శ్రేణులకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఇంకోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల శశికళ పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. మరోపక్క, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి సీనియర్ నేతలైన ఎం తంబిదురై, కేఏ సెంగోట్టయ్యనలు కూడా పోటీ పడ్డారు. అయితే, శనివారం వీరు మనసు మార్చుకోవడం గమనార్హం.
పావులు కదుపుతున్న శశికళ: మోడీకి పన్నీరు సెల్వం లేఖ
పార్టీ ప్రిసీడియం చైర్మన్ ఇ మధుసూదన, సీనియర్ నేతలైన కేఏ సెంగోట్టయ్యన, బి వలర్మతి, గోకుల ఇందిర, సైదై దురైస్వామి తదితరులంతా పోయెస్గార్డెనకు వెళ్లారు. వేదనిలయం నుంచి బయటకు వచ్చిన శశికళ ముందు.. వరుసగా నిలబడిన నేతలు చేతులు జోడిస్తూ ఆమెను వేడుకున్నారు.
వారి మాటల్ని ఆసాంతం ఆలకించిన ఆమె తల ఊపుతూ లోపలికి వెళ్లారని తెలుస్తోంది. త్వరలో జరగనున్న అన్నాడీఎంకే కార్యవర్గ, సర్వసభ్య సమావేశాల్లో శశికళ పేరు ప్రకటించడం ఖాయమైపోయింది. మరోవైపు, తన బంధువులెవరూ అధికార వర్గంలో, పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదని శశికళ ఒక ప్రకటనలో గట్టిగా హెచ్చరించారు.