ఐఎన్ఎక్స్ మీడియా కేసు: బ్యూరోక్రాట్ల మెడకు బిగుస్తోన్న సీబీఐ ఉచ్చు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐఎన్ఎక్స్ మీడియా కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా మాజీ కేంద్రమంత్రి చిదంబరంను సీబీఐ అరెస్టు చేయడంతో దేశం దృష్టంతా ఈ కేసుపైనే ఫోకస్ అయి ఉంది. తాజాగా చిదంబరం కస్టడీని మరో నాలుగు రోజుల పాటు పొడగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఎన్ఎక్స్ మీడియా కేసులో పలువురు ఐఏఎస్ ఉన్నతాధికారుల మెడకు కూడా ఉచ్చు బిగుస్తోంది. ఆ సమయంలో ఏ ఐఏఎస్ అధికారి ఎలాంటి పాత్ర పోషించారు అనేదానిపై సీబీఐ కూపీ లాగుతోంది.
ఐఎన్ఎక్స్ కేసులో బ్యూరోక్రాట్లు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరంతో పాటు ఆయన కుమారుడి హస్తంపై కూడా సీబీఐ విచారణ చేస్తోంది. నేతలు చేసే తప్పులకు ప్రభుత్వ ఉన్నతాధికారులు బలవుతున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించనుంది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో పనిచేసిన ఉన్నతాధికారులు ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2007వ సంవత్సరంలో ఎలా వచ్చాయో ఇందులో వారి పాత్ర ఏమిటన్నదానిపై సీబీఐ విచారణ చేయనుంది. మొత్తం ఆరుగురు బ్యూరోక్రాట్ల పాత్ర ఇందులో ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. వారందరినీ విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
దువ్వూరి సుబ్బారావును విచారణ చేసే అవకాశం
ఇందులో మొదటిగా సింధుశ్రీ కుల్లార్ ఉన్నారు. సింధుశ్రీ కుల్లార్ నీతి ఆయోగ్ మాజీ సీఈఓగా పనిచేశారు. 1975 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ సింధుశ్రీ ఏప్రిల్ 2007 నుంచి సెప్టెంబర్ 2008వరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో అడిషనల్ సెక్రటరీ హోదాలో పనిచేశారు. సెప్టెంబర్ 2008లో ఆమె స్పెషల్ సెక్రటరీగా పదోన్నతి పొందారు. ఇక ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావును కూడా సీబీఐ విచారణ చేసే అవకాశం ఉంది. ఎఫ్ఐపీబీ దృష్టికి నిబంధనల ఉల్లంఘన అంశం రాలేదని దువ్వూరి సుబ్బారావు ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి చెప్పారు. 1972 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన దువ్వూరి సుబ్బారావు పేపర్లపై అంతా స్పష్టంగా ఉండటంతో ఎఫ్ఐపీబీ బోర్డు ఆర్థికమంత్రి అప్రూవల్ కోసం పంపిందని చెప్పారు.2017లో ఎఫ్ఐపీబీని మోడీ సర్కార్ రద్దు చేసింది.
మరికొందరు బ్యూరోక్రాట్లపై సీబీఐ నజర్
ఇక వీరితో పాటు ఫిబ్రవరి 2006 నుంచి డిసెంబర్ 2010 వరకు 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి దీపక్ కుమార్ సింగ్ ఎఫ్ఐపీబీ ఇంఛార్జిగా పనిచేశారు. పీకే బగ్గా అనే మరో ఐఏఎస్ అధికారి ఆర్థికశాఖలో ఓఎస్డీగా జూలై 2006 నుంచి నవంబర్ 2012వరకు బాధ్యతలు చేపట్టారు. ఆయన్ను కూడా విచారణ చేయనుంది సీబీఐ. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఛైర్మెన్ పదవికి ఈఏడాది జనవరిలో రాజీనామా చేసిన అశోక్ చావ్లా కూడా ఈ కేసుతో సంబంధాలున్నట్లు సీబీఐ గుర్తించింది. ఐఎన్ఎక్స్ మీడియాకు అన్ని అనుమతులు వచ్చిన సమయంలో ఎఫ్ఐపీబీ అడిషనల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో కూడా అశోక్ చావ్లా పై ఆరోపణలున్నాయి. ఇక ఆర్థికశాఖలో 2006 నుంచి 2010 వరకు జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించిన అనూప్ కే పూజారీని కూడా సీబీఐ ప్రశ్నించనుంది. ఇప్పటి వరకు ఆయన్ను విచారణ చేయలేదు. అయితే విచారణ కోసం సీవీసీ నుంచి అనుమతి పొందింది సీబీఐ.