ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్తకు కరోనా పాజిటివ్: ఆ భవనం మూసివేత
న్యూఢిల్లీ: భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) శాస్త్రవేత్తలు ఓ వైపు కరోనా మహమ్మారి నివారణకు పరిశోధనలు చేస్తూనే.. మరోవైపు దేశ ప్రజలను కరోనా పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. అయితే, ఈ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్తలకు కూడా ఈ కరోనా మహమ్మారి సోకింది.
తెలంగాణలో ఒక్కరోజులో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు, ఐదు మరణాలు
కోవిడ్-19 కోర్ టీంలో పనిచేస్తున్న ఓ శాస్త్రవేత్తకు సోమవారం ఉదయం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఐసీఎంఆర్ అఫీసియల్ వాట్సాప్ గ్రూపులో సందేశం వచ్చింది. ఢిల్లీలోని ఐసీఎంఆర్ భవనాన్ని రెండు రోజులపాటు మాసివేస్తున్నామని, శాస్త్రవేత్తలు ఇంటి నుంచి పనిచేయాలని సూచించారు.
కాగా, బాధిత శాస్త్రవేత్త ముంబై నుంచి రెండు రోజుల కింద ఢిల్లీకి వచ్చారు. ఆదివారం జ్వరం లక్షణాలతో బాధపడుతున్న ఆయన నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. పరీక్ష ఫలితాల్లో పాజిటివ్ గా తేలడంతో ఐసీఎంఆర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఐసీఎంఆర్ కేంద్ర కార్యాలయాన్ని మూసివేసి రెండ్రోజులపాటు శానిటైజేషన్ చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ముంబైలోని ఐసీఎంఆర్కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ రీప్రొడక్టివ్ హెల్త్ లో ఆ శాస్త్రవేత్త పనిచేస్తున్నారు. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరాం భార్గవతో గత వారం జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆయన ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారనే వివరాలను సేకరించిన అధికారులు.. వారందరికీ కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువలో ఉంది. ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన దేశాల జాబితాలో భారత్ ఇప్పుడు ఏడో స్థానానిక చేరుకుంది. ఇక మనదేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.